రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-09-30T06:04:16+05:30 IST

రాష్ట్రాన్ని సీఎం జగన్‌ భ్రష్టుపట్టించారని మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు.

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి
నిరసన దీక్షలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అఖిలప్రియ

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 29: రాష్ట్రాన్ని సీఎం జగన్‌ భ్రష్టుపట్టించారని మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగిస్తూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ పట్టణంలోని ఆమె స్వగృహం ముందు గురువారం టీడీపీ శ్రేణులతో నిరసన దీక్షను చేపట్టారు. ఆమె మాట్లాడుతూ సీఎం జగన్‌కు పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు ఆయన పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీశారని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి ఇరభై ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా టీడీపీ హయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలు, మహిళలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్టీఆర్‌ పేరును తొలగించడాన్ని సీఎం జగన్‌ సోదరి తప్పుపట్టారని గుర్తుచేశారు. వైఎస్సార్‌ పేరును కొత్తగా నిర్మించే వాటికి పెట్టుకోవాలని ఆమె సూచించారని మాజీ మంత్రి తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక పోతే ప్రజలే తిరగబడతారని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌నాయుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి, చాగలమర్రి టీడీపీ నాయకులు అన్సర్‌ బాషా, కౌన్సిలర్‌ హుసేన్‌బాషా, చాంద్‌బాషా, అహోబిలం సంజీవరాయుడు, సోముల చంద్రశేఖరరెడ్డి, న్యాయవాది శివరామిరెడ్డి, నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T06:04:16+05:30 IST