చెర్వుగట్టు క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి
ABN , First Publish Date - 2021-04-20T07:14:00+05:30 IST
చెర్వుగట్టు క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు ధర్మకర్తలు, దేవస్థాన సిబ్బంది కృషి చేయాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ అన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్తూ మార్గమధ్యలో నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానాన్ని కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్
నార్కట్పల్లి, ఏప్రిల్ 19: చెర్వుగట్టు క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు ధర్మకర్తలు, దేవస్థాన సిబ్బంది కృషి చేయాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ అన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్తూ మార్గమధ్యలో నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానాన్ని కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఆలయ మర్యాదల మేరకు కమిషనర్కు ప్రఽధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సహార్చకులు పూర్ణకుంభం పట్టగా ట్రస్టు బోర్డ్డు చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డ్డి, ధర్మకర్తలు, ఈవో అన్నెపర్తి సులోచనలు స్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలనంతరం క్షేత్రంపై ఉన్న ఇతర పరివార దేవతలను దర్శించుకుని పరిసరాలను పరిశీలించారు. అమావాస్య రోజున చెర్వుగట్టుకు వచ్చే రద్దీని సీసీ పుటేజీల ద్వారా పరిశీలించిన కమిషనర్ భక్తులు సేద తీరేందుకు తక్షణంగా షెడ్ల నిర్మాణం చేపట్టాలని అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. గుట్ట కింద మెట్లమార్గంలో తుదిదశకు చేరుకున్న డార్మెటరీ హాలు నిర్మాణాన్ని పరిశీలించి భవన సముదాయంపై ఎక్కడా చెర్వుగట్టు మూలవిరాట్టు ప్రతిమ రూపం లేకపోవడం, ఆధ్యాత్మికత ఉట్టిపడాల్సిన నిర్మాణ శైలి గ్రామపంచాయతీ, మునిసిపాలిటీ భవనాల సముదాయం మాదిరిగా ఉండటంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతీ నెలా క్షేత్రంపై ఓ కొత్తదనం కన్పించేలా పనులు చేపట్టాలని ఆయన సూచించారు.పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం ట్రాక్టర్ కొనుగోలు, ఘాట్రోడ్ మీదుగా ప్రయాణీకులను గుట్టపైకి చేరవేసేందుకు రెండు మినీ బస్సుల ఏర్పాటుకై ట్రస్టుబోర్డు తీర్మానం చేశామని చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి కమిషనర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కమిషనర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి తనను సంప్రదించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఈవోకు సూచించారు. సిబ్బంది కొరతను ఔట్సోర్సింగ్ నియామకాల ద్వారా భర్తీ చేసుకోవాలన్నారు. సస్పెన్షన్తో ఖాళీగా ఉన్న ఆలయ సూపరింటెండెంట్ పోస్టులో సీనియర్అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని ఇన్చార్జిగా నియమించాలని ఈవోకు కమిషనర్ సూచించారు. అనంతరం తెలంగాణా ఆది శైవ అర్చక బ్రాహ్మణ సంఘం ప్లవ నామ సంవత్సర క్యాలెండర్ను కమిషనర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, ధర్మకర్తలు మారపాకల ప్రభాకర్రెడ్డి, బూర్గు కృష్ణయ్య, చిక్కుళ్ల యాదగిరి, వంపు శివశంకర్, కంకల యాదయ్య, దండు శంకరయ్య, ఏసీ కే.మహేంద్రకుమార్, ఈఈ, డీఈఈలు మల్లికార్జున్రెడ్డి, రాజేశ్వర్, ఇంద్రసేనారెడ్డిలు ఉన్నారు.