అత్యుత్సాహం!
ABN , First Publish Date - 2020-07-11T10:33:49+05:30 IST
కొవిడ్ విజృంభిస్తోంది. పాఠశాలలు ఓపెన్ చేయటానికి వీలులేదు. జూలై 31వ తేదీ వరకూ పిల్లలు బడికి వద్దని కేంద్రం స్పష్టమైన
కరోనా వేళ.. పిల్లలను కూర్చోబెట్టి పాఠాలు!
ఈనెల 31 వరకూ స్కూళ్లకు పిల్లలు వద్దన్న కేంద్రం
బండ్లపల్లిలో టీచర్లు, హెచ్ఎం బేఖాతర్
60 మంది విద్యార్థులను పాఠశాలకు రప్పించిన దుస్థితి
మీడియా ప్రశ్నించటంతో.. వెనక్కి పంపిన వైనం
అనంతపురం విద్య/నార్పల, జూలై 10: కొవిడ్ విజృంభిస్తోంది. పాఠశాలలు ఓపెన్ చేయటానికి వీలులేదు. జూలై 31వ తేదీ వరకూ పిల్లలు బడికి వద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలే విద్యార్థులను పిలవట్లేదు. ఈ పరిస్థితుల్లోనూ కొన్ని స్కూళ్ల ఉపాధ్యాయులు.. పిల్లలను స్కూళ్లకు ఆహ్వానిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నార్పల మండలం పి.బండ్లపల్లి పాఠశాల ఉపాధ్యాయులు అత్యుత్సాహం చూపారు. విద్యార్థులను స్కూల్కు రప్పించారు. సుమారు 60 మంది స్కూల్కు వచ్చారు. దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలే చిన్నారులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. నిత్యం వందలాది పాజిటివ్ కేసులు వస్తున్న ఇలాంటి తరుణంలో పిల్లల ఆరోగ్యం పట్ల పాఠశాల టీచర్లు, ప్రధానోపాధ్యాయుడు జాగ్రత్త వహించకపోవటం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జి కోర్సులో పిల్లలకు సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసి, వెంటనే పంపేయాలి. స్కూల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధించరాదు. వైరస్ విస్తరణ నేపథ్యంలో ఇది ప్రమాదకరం. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను ఎందుకు స్కూల్కు పిలిపించారు? కూర్చోబెట్టి ఎందుకు పాఠాలు చెబుతున్నారంటూ.. విలేకరులు ప్రశ్నించటంతో తేరుకున్న టీచర్లు, ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థులను ఇళ్లకు పంపారు.