ప్రజలను మోసం చేస్తున్న కేంద్రం
ABN , First Publish Date - 2022-08-13T06:17:46+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశ ప్రజలను మోసం చేస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవలు
ఉక్కుటౌన్షిప్, ఆగస్టు 12: కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశ ప్రజలను మోసం చేస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. స్టీల్ ప్లాంట్లోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ‘75 ఏళ్ల స్వాతంత్య్రం-నేటి కర్తవ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలంతా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ, రాజ్యాంగం కల్పించే హక్కులు పొందుతూ స్వేఛ్చాయుత జీవనం కోసం ఆనాడు జరిగినది స్వాతంత్య్ర ఉద్యమమని పేర్కొన్నారు. నాడు సాధించిన స్వాతాంత్ర్యాన్ని నిలుపుకునేందుకు నాలుగు ప్రధాన అంశాలపై మేధావులు యోచించి పదును పెట్టడంతో ఏర్పడినదే రాజ్యంగమన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, లౌకికవాదం, ఫెడరలీజం, సమానత్వమే ఆ నాలుగు ప్రధాన అంశాలన్నారు. మతం అన్నది వ్యక్తిగతమని, ప్రపంచవ్యాప్తంగా వున్న మతోన్మాదం అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ స్టీల్ ప్లాంట్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్, ప్రధాన కార్యదర్శి వైటీ దాసు, కార్పొరేటర్ బి.గంగారావు, నాయకులు జగ్గునాయుడు, కేఎం శ్రీనివాస్, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.