కారు బోల్తాపడి ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-01-14T05:17:15+05:30 IST
మండలకేంద్రమైన దువ్వూరుకు సమీపంలో ఘోరీస్వామి దర్గా వద్ద జాతీయరహదారిపై కారు బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు.
ఆరుగురికి గాయాలు
సంక్రాంతికి సొంతూరికి వస్తుండగా ఘటన
దువ్వూరు, జనవరి 13: మండలకేంద్రమైన దువ్వూరుకు సమీపంలో ఘోరీస్వామి దర్గా వద్ద జాతీయరహదారిపై కారు బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా... సుండుపల్లెకు చెందిన ప్రభాకర్, జ్ఞానకుమార్ హైదరాబాదులో ఉంటున్నారు. వీరు సంక్రాంతి పండుగ కోసం సొంత ఊరికి మంగళవారం కుటుంబ సభ్యులతో బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున దువ్వూరు సమీపంలోకి రాగానే డ్రైవరు నిద్రమత్తులో ఉండడంతో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో పెద్దివీది ప్రభాకర్ (30) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో శరణ్య అనే మహిళ (30) పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కారులో ఉన్న సుండుపల్లె మండలానికి చెందిన మధుసూదనరావు, జ్ఞానకుమార్, ఉదయభాస్కర్, గోపిక, లావణ్య, డ్రైవర్ అశోక్కుమార్నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. దువ్వూరు ఎస్ఐ కుళాయప్ప సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.