బైక్ కోసం యువకుడి దారుణ హత్య
ABN , First Publish Date - 2022-01-23T05:47:25+05:30 IST
బైక్ కోసం యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
ఆదిలాబాద్, జనవరి 22(ఆంధ్రజ్యోతి) : బైక్ కోసం యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని పుత్లిభౌలికి చెందిన ఇందూరు గజానంద్ (36) స్థానికంగా వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే డబ్బులు అవసరం కావడంతో.. ఈ నెల ఒకటో తేదీన తన ద్విచక్ర వాహనాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్లోని బంగారుగూడకు చెందిన షేక్అస్లాం(22), ఏటిపోక విజయ్(20)లు తమకు వడ్డీ వ్యాపారి తెలుసునని గజానంద్ను మాయ మాటలతో నమ్మించారు. రాత్రి వరకు పట్టణంలోని పలు కాలనీల్లో బైక్పై తిప్పుతూ చివరకు జైనథ్ మండలంలోని తర్నం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి కత్తితో మృతుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత బైక్ తీసుకొని ఇద్దరు పరారయ్యారు. జైనథ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. సీసీ కెమెరాల పరిశీలనతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ ఉదయ్కుమార్ వివరించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్రావు, జైనథ్ సీఐ కొంకమల్లేష్, రూరల్ సీఐ పురుషోత్తంచారి, ఎస్సైలు హరిబాబు, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.