బీచ్‌లో అనుమానాస్పదంగా గోనె మూట.. భయంతో పోలీసులకు ఫోన్.. ఓపెన్ చేసి చూస్తే అందులో..

ABN , First Publish Date - 2022-04-30T18:45:49+05:30 IST

గురువారం సాయంత్రం ముంబైలోని వెర్సోవా బీచ్‌లో ఓ గోనె సంచి కలకలం సృష్టించింది.. దానిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు..

బీచ్‌లో అనుమానాస్పదంగా గోనె మూట.. భయంతో పోలీసులకు ఫోన్.. ఓపెన్ చేసి చూస్తే అందులో..

గురువారం సాయంత్రం ముంబైలోని వెర్సోవా బీచ్‌లో ఓ గోనె సంచి కలకలం సృష్టించింది.. దానిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ గోనె మూటను తెరిచి చూడగా అందులో నుంచి 19 ఏళ్ల యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. ఎవరో ఆ యువతిని వైరుతో గొంతు నులిమి చంపేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ యువతి ఫొటోలను వెర్సోవా పోలీసులు వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే గోరేగాన్ పోలీసులు స్పందించారు. 


ఆ యువతి తప్పిపోయినట్టు రెండ్రోజుల క్రితమే ఆమె తల్లిదండ్రులు తమ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు. దీంతో తల్లిదండ్రులను మార్చురీకి పిలిపించగా వారు తమ కూతురిని గుర్తు పట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. తాము గోరేగాన్ పరిధిలోని ఛాల్ ప్రాంతంలో నివసిస్తున్నామని, మంగళవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన తమ కూతురు ఇంటికి తిరిగి రాలేదని ఆ యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ కూతురు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు సిద్ధమవుతోందని తెలిపారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్యకు ముందు ఆ యువతిపై అత్యాచారం ఏమైనా జరిగిందా? అని తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆమె ట్యూషన్ క్లాస్‌లను ఎగ్గొట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్లిందని, అక్కడే ఏదో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె స్నేహితులందరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.     

Updated Date - 2022-04-30T18:45:49+05:30 IST