ఆ రెండింటి వల్లే యూపీలో బీజేపీ గెలుపు సాధ్యమైందా!.. ఇంతకీ అవేంటంటే..
ABN , First Publish Date - 2022-03-11T03:14:01+05:30 IST
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు దాదాపు వచ్చేశాయి. పంజాబ్ మినహా... యూపీ, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతోంది. ఇదిలావుండగా..
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు దాదాపు వచ్చేశాయి. పంజాబ్ మినహా... యూపీ, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతోంది. ఇదిలావుండగా యూపీలో రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకున్న.. బీజేపీ గెలుపునకు గల కారణాలపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా 2017 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు మధ్య తేడాను ప్రజలు బేరీజు వేస్తున్నారు. అప్పట్లో ముజఫర్ నగర్ అల్లర్లు ఎన్నికలపై ప్రభావం చూపాయని చెబుతున్నారు. ఈ ఏడాదిలో అలాంటి ఘటనలేవీ చోటు చేసుకోలేదు. లా అండ్ ఆర్డర్ను అమలు చేయడంలో యోగీ సక్సెస్ అయ్యారని, అలాగే హిందూత్వ వాదాన్ని తెరపైకి తేవడం వంటి కారణాలతో పార్టీ విజయం నల్లేరుమీద నడకగా మారిందని చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో అధికార పార్టీ వరుసగా రెండోసారి గెలవడం గత 37 ఏళ్లలో ఇదే మొదటి సారి. 2017 ఎన్నికల సమయంలో ముజఫర్ నగర్ అల్లర్లు ఎన్నికలపై ప్రభావం చూపాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడం గెలుపునకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు తదితరాల కంటే ప్రధానంగా లా అండ్ ఆర్డర్ అమలు మాత్రమే ఈ గెలుపునకు కారణమైందని చెప్పొచ్చు. భద్రత కల్పిస్తే చాలు అనే పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు.. అందుకు తగ్గట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడంతో మరోసారి అధికారాన్ని అందించారు. ఆగ్రా ఇండస్ట్రియల్ ఏరియా, సాహిబాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల ప్రజలు పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు.
ప్రధానంగా మహిళల రక్షణ విషయంలో గొప్ప మార్పుని యోగి తీసుకొచ్చాడని జనం అంటున్నారు. అలాగే, భూ కబ్జాలు కూడా చాలా తగ్గాయని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా శాంతిభద్రతలతో కూడుకున్న హిందూత్వ నినాదం, విధానం కాషాయదళానికి చారిత్రక విజయం సాధించి పెట్టిందని మనం భావించవచ్చు. అయోధ్య రామాలయ నిర్మాణం, కాశీ కారిడార్ వంటివి మోదీ, యోగి ద్వయానికి హిందూత్వ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉండేలా చూశాయి...