కడుపునొప్పి తగ్గిస్తానంటూ బొడ్డుచుట్టూ కొరికాడు

ABN , First Publish Date - 2021-09-15T09:16:49+05:30 IST

మూడు నెలల శిశువు.. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే వైద్యం చేయించాల్సిన తల్లిదండ్రులు, ఓ భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడేమో.. కడుపునొప్పితోనే శిశువు ఏడుస్తున్నాడని, తాను తగ్గిస్తానని చెప్పి..

కడుపునొప్పి తగ్గిస్తానంటూ బొడ్డుచుట్టూ కొరికాడు

  • 3నెలల శిశువును బలిగొన్న భూతవైద్యుడు
  • తెగిన చిన్నపేగు.. ఆస్పత్రిలో మృతి
  • భద్రాద్రి జిల్లా అశ్వాపురపుపాడులో దారుణం


కరకగూడెం, సెప్టెంబరు 14: మూడు నెలల శిశువు.. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే వైద్యం చేయించాల్సిన తల్లిదండ్రులు, ఓ భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడేమో.. కడుపునొప్పితోనే శిశువు ఏడుస్తున్నాడని, తాను తగ్గిస్తానని చెప్పి.. బిడ్డ బొడ్డు చుట్టూ కొరికాడు. పంటి తీవ్రతకు లోపల చిన్నపేగు తెగిపోవడంతో ఆ బిడ్డ మృతిచెందింది. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురపుపాడులో మంగళవారం ఈ ఘటన జరిగింది.  ఆశా కార్యకర్త నాగమణి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు మూడు నెలల మగబిడ్డ ఉన్నాడు. రెండు, మూడురోజులుగా బాబు ఏడుస్తున్నాడు. గ్రామానికి చెందిన భూతవైద్యుడు దేవరబాల (పూనకం వచ్చే వ్యక్తి) వద్దకు తీసుకెళ్లగా అతడు శిశువు బొడ్డుచుట్టూ కొరికాడు. అయినా బాలుడు ఏడుపు ఆపకపోవడంతో కరకగూడెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.  పరిస్థితి విషమంగా ఉండటంతో ఆశ కార్యకర్త నాగమణికి ఫోన్‌ చేశారు. ఆమె 108కు సమాచారం అందించడంతో అదే వాహనంలో బాలుడిని భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడికి చికిత్స చేసేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందాడు. వైద్యులు పరిశీలించగా చిన్నపేగు తెగినట్లు తేలింది. ఆ గాయంతోనే బాలుడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. ఇది  ఎలా జరిగిందని  వైద్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని శిశువు తల్లిదండ్రులు వారు వెల్లడించారు. ఈ  ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.

Updated Date - 2021-09-15T09:16:49+05:30 IST