కేంద్రం నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలి
ABN , First Publish Date - 2022-08-18T05:38:46+05:30 IST
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలని రైతు సమన్వయ సమితి సంఘ నాయకులు పిలుపునిచ్చారు.
రైతు సమన్వయ సమితి
కలెక్టరేట్, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలని రైతు సమన్వయ సమితి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా రైతాంగ సమస్యలపై నిరంతర పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్నారు. ఈ సందర్భంగా పంటల మద్దతు ధరల చట్ట తెస్తామని, విద్యుత్ చట్ట సవరణ బిల్లు నుంచి వ్యవసాయాన్ని మినహాయిస్తామని, లఖింపూర్ ఘటన దోషులను శిక్షిస్తామని కిసాన్ సంయుక్త మోర్చా పోరాట కమిటీకి రాతపూర్వకంగా హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ హామీలను కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. కార్యక్రమంలో పలు రైతు సంఘాల నాయకులు తాండ్ర ప్రకాష్, కె.మోహనరావు, పి.ప్రసాదరావు. పి. తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.