కళలను సంరక్షించాలి
ABN , First Publish Date - 2022-01-12T05:30:00+05:30 IST
అంతరించిపోతున్న కళలను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జానపద సాహిత్యకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న, ఏపీ స్టేట్ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ వంగపండు ఉష తెలిపారు. బుధవారం మందస మండలం మొగిలిపాడులో సిక్కోలు జానపద సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జానపద కళాజాత నిర్వహించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న
మొగిలిపాడులో సందడిగా సిక్కోలు జానపద కళాజాత
హరిపురం, జనవరి 12: అంతరించిపోతున్న కళలను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జానపద సాహిత్యకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న, ఏపీ స్టేట్ క్రియేటివిటీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ వంగపండు ఉష తెలిపారు. బుధవారం మందస మండలం మొగిలిపాడులో సిక్కోలు జానపద సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జానపద కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానపదాలకు ఆదరణ తగ్గలేదన్నారు. సినీ పరిశ్రమలో జానపద గీతాలే ముందువరుసలో ఉంటున్నాయని చెప్పారు. సినీ నటుడు డాక్టర్ కుమార్నాయక్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో కళాకారుల్లోని ప్రతిభ అందరికీ తెలిసేందుకు ఇటువంటి కళాజాతలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జానపద గీతాలు, జముకల కథ, తప్పెటగుళ్లు, జాలరి నృత్యాలు, అమ్మవారి పాటలు, 42 విభాగాల్లో వివిధ రకాల కళలను ప్రదర్శించారు. గోరటి వెంకన్న, వంగపండు ఉష ఆలపించిన ‘గల్లీ చిన్నది’ వంటి గీతాలు అలరించాయి. జానపద కళాకారులు రట్టి భగవాన్దాస్, బాడ సూరన్న, అసిరయ్య, నెల్లూరు చిన్నారులు ఆలపించిన గీతాలతోపాటు పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ దానయ్య, జడ్పీటీసీ చంద్రమ్మ, మామిడి కృష్ణారావు పాల్గొన్నారు.