ఇసుకపై సీరియస్
ABN , First Publish Date - 2020-07-02T10:13:30+05:30 IST
రాజకీయ స్వార్థపరుల ఆర్ధిక ప్రయోజనాలకు బంగాళాఖాతం సముద్రతీరం బలైపోతోంది. తీరప్రాంత గ్రామాలకు రక్షణ కవచంలా ఉండే
తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆగ్రహం
జోరుగా ఇసుక తవ్వకాలు, యథేచ్ఛగా రొయ్యల చెరువుల సాగు
అటువంటివి ఏమీ లేవన్న ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వంతోపాటు కేంద్రశాఖలకు జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు
ఐదుగురు అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు
మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఎన్జీటీ ఆదేశం
(కాకినాడ-అమలాపురం): రాజకీయ స్వార్థపరుల ఆర్ధిక ప్రయోజనాలకు బంగాళాఖాతం సముద్రతీరం బలైపోతోంది. తీరప్రాంత గ్రామాలకు రక్షణ కవచంలా ఉండే ఇసుక తిన్నెలను యఽథేచ్ఛగా తరలించి, రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక ప్రజాప్రతినిధుల సంపూర్ణ అండదండలతో సముద్రపు ఇసుకను అక్రమంగా తవ్వేసి అమ్మకాలు చేయడంతోపాటు ఆ భూములను రొయ్యల చెరువులుగా మార్చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ముసుగులో ఉన్న నాయకులు చేస్తున్న ఈ అక్రమ దందాలపై ఓ వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు.
దీనిపై తీవ్రంగా స్పందించి ఎన్జీటీ తీర ప్రాంత భూముల్లో అక్రమ ఇసు క తవ్వకాలు, రొయ్యల చెరువుల సాగు వంటి అంశాలపై పరిశీలనచేసి నివేదిక సమర్పించాలని ఒక కమిటీని కూడా నియమించింది. ఒకవైపు సముద్రపు కోత, మరోవైపు రాజకీయ నాయకుల స్వార్థంతో పొడుస్తున్న తూట్లతో తీరప్రాంతం గుల్లవుతూ ప్రమాదాలకు నెలవుగా మారింది. ముఖ్యంగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చింతలమోరి, తూర్పుపాలెం, కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, పడమటిపాలెం, శంకర గుప్తం, కేశవదాసుపాలెం, అంతర్వేదికర, అంతర్వేది దేవస్థానం, పల్లిపా లెంతోపాటు అమలాపురం నియోజకవర్గ పరిధిలోని కొమరగిరిపట్నం, ఓడలరేవు, వాసాలతిప్ప, ఎస్.యానం, చిర్రయానంతో సహా వివిధ ప్రాంతాల్లో సముద్రపు ఇసుక అక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ మద్దతుతో పనిచేస్తున్న కీలక ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయంతోనే ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న విద్యావం తులు, పౌరహక్కుల సంఘాల నాయకులు, సమాచారహక్కు చట్టం ప్రతినిధులు ఎవరికివారే తీరప్రాంత భద్రతపై తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. తీరప్రాంత భూముల్లో తవ్వకాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాలనూ ప్రచురించింది. అయితే లండన్లో ఉంటున్న సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంకు చెందిన యెనుముల వెంకటపతిరాజు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనిపై తీర ప్రాంత భూముల వ్యవహారంపై వెంకటపతిరాజు పిటిషన్ను ఎన్జీటీ విచారణకు స్వీకరించింది. దీనిపై బుధవారం ప్రభుత్వానికి కీలక ఆదేశాలిచ్చింది. సముద్రపు ఇసుక అక్రమ తవ్వకాలు, రొయ్యల చెరు వుల తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సమీపంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వల్ల తీరప్రాంత గ్రామాలకు ముప్పు వాటిల్లుతుందని, ఇటీవల సముద్రపు నీరు గ్రామాలను ముంచెత్తిన పరిస్థితులను సైతం పిటిషన్లో పేర్కొ న్నారు. వెంకటపతిరాజు దాఖలుచేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఎన్జీటీ నష్టాలను అంచనా వేయడానికి ఒక సంయుక్త కమిటీని ఏర్పా టు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి మూడు నెలల్లో నివేదికను ఇవ్వాలని ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి ఇసుక తవ్వకాలు జరగడంలేదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో వాదించింది. అయితే పిటిషనర్ పూర్తిస్థాయి ఆధారాలను ఎన్జీటీ ముందు ఉంచారు. ఈ కేసు విచారణను ఎన్జీటీ అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.