‘ఆంధ్రజ్యోతి’ కథనం కదిలించింది
ABN , First Publish Date - 2021-05-06T08:49:27+05:30 IST
కరోనా మృతదేహాలను తీసుకెళ్లి దహన సంస్కారాలను చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం, మృతదేహాలను ప్రభుత్వ సిబ్బందే దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిన కొవిడ్ తొలి దశనాటి రోజులవి
కరోనా మృతదేహాలను తీసుకెళ్లి దహన సంస్కారాలను చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం, మృతదేహాలను ప్రభుత్వ సిబ్బందే దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిన కొవిడ్ తొలి దశనాటి రోజులవి. గత ఏడాది ఏప్రిల్ నెలలో నెల్లూరులో నాలుగు కరోనా మృతదేహాలను మున్సిపల్ ట్రాక్టర్లో వేసుకొని జేసీబీతో గొయ్యి తీసి ఒకే గోతిలో పాతిపెట్టారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ఈ హృదయవిదారక ఘటన నెల్లూరు జిల్లాకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన సభ్యులను కదిలించివేసింది. ఆ మరుసటి రోజు నుంచే ఈ సంస్థ సభ్యులు కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. తొలి వేవ్లో సుమారు 200లకు పైగా దహన సంస్కారాలు వీరి చేతుల మీదుగా జరిగాయి. రెండో విడతలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. మరో సంస్థ ఆల్ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ కూడా ముందుకొచ్చింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖాషిఫ్, జిల్లా కార్యదర్శి షేక్ ఇమామ్ బాషా, ఇమామ్స్ కౌన్సిల్ జిల్లా కార్యదర్శి అఫీజ్ ఖలీల్ ముఖ్యసభ్యులు.