రైతులకు లాభం కల్పించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-04-16T05:29:07+05:30 IST

రైతులకు లాభం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

రైతులకు లాభం కల్పించడమే లక్ష్యం
నంగునూరు మండలం పాలమాకులలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

 జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు 

 ఆయిల్‌పాం తోటలపై దృష్టి సారించాలి

 మంత్రి హరీశ్‌రావు


నంగునూరు, ఏప్రిల్‌ 15: రైతులకు లాభం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలువల  ద్వారా కాళేశ్వరం నీరు రావడంతో ఈ యాసంగిలో రూ.1,600 కోట్ల విలువైన పంట జిల్లాలో పండనున్నదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. ఈసారి అదనంగా 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గతేడాది యాసంగిలో లక్షా20 వేల ఎకరాల సాగు కాగా, ఈ యాసంగిలో 2 లక్షల 80 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగయ్యిందని తెలిపారు. ఇదంతా కాళేశ్వరం జలాలతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పైకొచ్చాయని, బోరు, బావుల్లో ఊటలు పెరిగాయని, రాబోయే రోజుల్లో వరినాట్లు వేసేందుకు లేబర్‌ దొరికే పరిస్థితి రానున్నదని చెప్పారు. ఈ సారి బడ్జెట్‌లో రూ.1500 కోట్లతో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణకు వరికోత, ఏరిపోత యంత్రాలు, కూలీల కొరత అధిగమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలకు వడ్డీలేని రుణాల కోసం బడ్జెట్‌లో రూ.3 వేల కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి చెప్పారు. జిల్లాలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌ సాగుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ పంటలపై అవగాహన కల్పించడం కోసం ఇక్కడి రైతులను ఖమ్మం జిల్లాలో యాత్రకు పంపినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా రైతులు వెళ్తామంటే పంపిస్తామని తెలిపారు. అధిక లాభాలిచ్చే ఆయిల్‌పామ్‌ తోటల సాగుకై రైతులు ముందుకు రావాలని మంత్రి కోరారు. నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనాను అరికట్టేందుకు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. నాగరాజుపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజిరెడ్డి ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఆయనవెంట కొమురవెళ్లి ఆలయ చైర్మన్‌ మల్లయ్య, మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ సారయ్య, మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, నంగునూరు మాజీ ఏఎంసీ చైర్మన్‌ సోమిరెడ్డి, సర్పంచ్‌ కుమార్‌ ఉన్నారు.


 

Updated Date - 2021-04-16T05:29:07+05:30 IST