ఆ నోటిఫికేషన్‌ను సవరించాల్సిందే

ABN , First Publish Date - 2022-05-21T05:36:35+05:30 IST

కృష్ణానది యాజమాన్య బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మార్పులు చేయాల్సిందేనని రాయసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.

ఆ నోటిఫికేషన్‌ను సవరించాల్సిందే

కేంద్రంతో సీఎం మాట్లాడాలి

కృష్ణాబోర్డు కార్యాలయాన్ని కర్నూల్లో ఏర్పాటు చేయాలి 

సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి 


నంద్యాల టౌన్‌, మే 20 : కృష్ణానది యాజమాన్య బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మార్పులు చేయాల్సిందేనని రాయసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాలలో సీనియర్‌ న్యాయవాది శంకరయ్య అధ్యక్షతన ఈనెల 31వ తేదీ జరగనున్న సిద్ధేశ్వరం జలదీక్ష విజయవంతానికి ప్రచార సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ సాగు, తాగునీటి విషయాల్లో దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న రాయలసీమ ప్రజలకు అండగా ఉండి పోరాడాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఉందని అన్నారు. ఏపీ విభజన చట్టం - 2014లో రాయలసీమ సాగునీటికి కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా కృష్ణానది నది  యాజమాన్య బోర్డు నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జులై 15న విడుదల చేసిందని అన్నారు. ఇందులో రాయలసీమకు నష్టం చేసే అంశాలను తప్పక సవరించాలని డిమాండ్‌ చేశారు. దీని కోసం కేంద్రంతో ముఖ్యమంత్రి స్థాయి దౌత్యం అత్యంత కీలకమని అన్నారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టిసారించాలని కోరారు. ఈ విషయం అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసికెళ్లామని అన్నారు. అలాగే కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  ఈ విషయంపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇటీవల కేంద్ర జలశక్తి స్టాడింగ్‌ కమిటీ చైౖర్మన్‌ సంజయ్‌ జైస్వాల్‌ దృష్టికి తీసుకుపోయారని అన్నారు. శ్రీశైలం డ్యాంలో పూడిక ఎక్కువగా చేరడం వల్ల  నీటి లభ్యత తగ్గిపోయిందని అన్నారు. పూడిక ఇలాగే చేరితే భవిష్యత్‌లో డ్యాం ప్రమాదంలో పడుతుందని అన్నారు.  శ్రీశైలం డ్యాం జీవితకాలం పెరగడానికి, డ్యాంలో పూడిక నివారణకు కూడా సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎన్‌ రెడ్డి, పార్థసారధి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T05:36:35+05:30 IST