ఆ ఎన్నిక చెల్లదు..
ABN , First Publish Date - 2022-09-28T06:15:22+05:30 IST
హెచ్ఎంపాడు మండలం వాలిచర్ల హైస్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నిక మళ్లీ మొదటికొచ్చింది.
మళ్లీ నిర్వహించాలి స్కూల్కు రండి..!
విద్యార్థుల తల్లిదండ్రులకు వాలిచర్ల హెచ్ఎం హుకుం
టీడీపీ మద్దతుదారులు గెలవడమే కారణం
నిధుల దుర్వినియోగం బయటికొస్తుందని వైసీపీ నేతల జంకు
హనుముంతునిపాడు, (కనిగిరి) సెప్టెంబరు 27: హెచ్ఎంపాడు మండలం వాలిచర్ల హైస్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నిక మళ్లీ మొదటికొచ్చింది. జరిగిన ఎన్నిక చెల్లదు.. మళ్లీ నిర్వహించాలి 28వ తేదీ (నేడు) రావాలని ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ కరీమ్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆరు నెలలుగా వాలిచర్ల హైస్కూల్ కమిటీ ఎన్నికకు వైసీపీ అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ వ్యవహారంలో హెచ్ఎం, విద్యాశాఖాధికారులు వారికి తొత్తులుగా మారారు. ఎట్టకేలకు ఈనెల 20న ఎన్నికలు జరిగి టీడీపీ మద్దతుదారులు చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఆ ఎన్నిక చెల్లదంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
నిధుల గోల్మాల్ బయటపడుతుందనేనా?
వాలిచర్ల హైస్కూల్లో నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. అందుకే వైసీపీ నేతలు ఎమ్మెల్యే వద్ద పార్టీ ప్రతిష్ట అంటూ కలరింగ్ ఇచ్చి ఎన్నికను మళ్లీ నిర్వహించేలా జిల్లా ఉన్నతాధికారు లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. టీడీపీ వారు కమిటీ చైర్మన్గా కొనసాగితే అన్నీ బయటికి వస్తాయేమోనని వైసీపీ నేతలు భయపడుతున్నారు.
చక్రం తిప్పుతున్న విద్యాశాఖాధికారి
వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతూ పదేపదే కమిటీ ఎన్నిక జరగకుండా చూడటం వెనుక ఓ విద్యాశాఖాధికారి చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. ఆయనకు వైసీపీ నేతలు ముడుపులు ముట్టజెప్పారన్న ప్రచారం నడుస్తోంది. మరోపక్క సదరు విద్యాశాఖాధికారిపై టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేత న్యాయపరంగా ఎంతటిస్థాయికైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.