అది తప్పుదోవ పట్టించే పోస్ట్
ABN , First Publish Date - 2020-12-03T07:30:14+05:30 IST
అది తప్పుదోవ పట్టించే పోస్ట్
బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ
వీడియోపై ట్విటర్ ప్రకటన
న్యూఢిల్లీ, డిసెంబరు 2: బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయకు ట్విటర్ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన చేసిన ఓ పోస్టును తప్పుదోవ పట్టించే పోస్టు అంటూ ఫ్లాగ్ చేసింది. దీంతో నెటిజన్లు మాలవీయ తీరుపై తీవ్రంగా స్పందించారు. ఇండియాలో తొలిసారిగా ఒక ట్వీట్ను ఫేక్న్యూస్ అంటూ ట్విటర్ ఫ్లాగ్ చేసిన ఘనత ఈ వార్తకే దక్కిందంటూ వ్యాఖ్యానించారు. కాగా, హరియాణాలో నిరసనలో పాల్గొన్న ఓ రైతుపై పోలీసు లాఠీచార్జీ చేస్తున్న ఫొటోను కాంగ్రెస్ నేత రాహుల్ ఇటీవల ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మాలవీయ ‘ప్రచారం వాస్తవానికి మధ్య ’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
పోలీసు లాఠీ దెబ్బ నుంచి రైతు తప్పించుకున్నట్లుగా వీడియో చిత్రీకరణ ఉంది. రాహుల్ చాలా కాలంగా అత్యంత అపఖ్యాతి పాలైన ప్రతి పక్ష నేత అంటూ మాలవీయ ఆ వీడియోకు వ్యాఖ్యను జోడించారు. అయితే ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ‘ఏఎల్టి న్యూస్’ రైతుల ఆందోళనపై పూర్తిస్థాయి వాస్తవ వీడియోను ఉంచింది. రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన వైనం ఈ వీడియోలో స్పష్టంగా ఉంది.