మోదీనే ఉదాహరణగా నిలిచినందుకు థాంక్స్: హర్షవర్ధన్

ABN , First Publish Date - 2021-03-01T20:51:12+05:30 IST

అరవై ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రెండో దశ వ్యాక్సినేషన్..

మోదీనే ఉదాహరణగా నిలిచినందుకు థాంక్స్: హర్షవర్ధన్

న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రెండో దశ వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. సిస్టర్ నివేదా ఆయనకు భారత్ బయోటెక్  కొవాగ్జిన్ టీకా ఇచ్చారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని తొలి టీకా వేసుకుని అందరికీ ఒక ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు.


'మనం సొంతంగా తయారు చేసిన రెండు వ్యాక్సిన్లు సురక్షితమని మొదట్నించీ నేను చెబుతున్నాను. ఇమ్యునోజెనిసిటీ పరంగా చాలా కచ్చితంగా పనిచేస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ మనం ఒక ఉదాహరణగా నిలవాలని ప్రధాని పదేపదే చెబుతుంటారు. 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకాగానే తొలి టీకా ఆయనే వేయించుకున్నారు' అని హర్షవర్దన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, విపక్షాల ఎమ్మెల్యేలు సైతం వ్యాక్సినేషన్ తీసుకోవాలని, తద్వారా ప్రజలకు కూడా సాధ్యమైనంత త్వరగా వాక్సినేషన్ తీసుకోవాలనే సందేశం పంపాలని కోరారు.


కాగా, ప్రధాని మోదీ తొలి టీకా తీసుకోవడం ద్వారా మనం కూడా మన సమయం వచ్చినప్పుడు టీకా తీసుకోవాలని సందేశం ఇచ్చారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ నుంచి సురక్షితంగా బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-01T20:51:12+05:30 IST