తమిళనాడు వాంటెడ్‌ క్రిమినల్‌ దొరికాడు

ABN , First Publish Date - 2022-01-29T04:42:48+05:30 IST

ఎస్‌ఈబీ అధికారులకు తమిళనాడు వాంటెడ్‌ క్రిమినల్‌ దొరికాడు. బైక్‌పై గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సాధారణ తనిఖీల్లో పట్టుకున్నారు.

తమిళనాడు వాంటెడ్‌ క్రిమినల్‌ దొరికాడు
నిందితుడు మురుగన్‌, గంజాయితో ఎస్‌ఈబీ అధికారులు

చెక్‌పోస్టులో గంజాయిను తరలిస్తుండగా గుర్తింపు

తడ, జనవరి 28 : ఎస్‌ఈబీ అధికారులకు తమిళనాడు వాంటెడ్‌ క్రిమినల్‌ దొరికాడు. బైక్‌పై గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సాధారణ తనిఖీల్లో పట్టుకున్నారు. తీరాచూస్తే ఆ వ్యక్తి తమిళనాడు పోలీసుల వాంటెడ్‌ క్రిమినల్‌గా  గుర్తించారు. రాష్ట్ర సరిహద్దు భీములవారిపాళెం చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ అధికారులు చెన్నైవైపు వెళ్లే వాహనాలను శుక్రవారం మధ్యాహ్నం తనిఖీ చేస్తున్నారు. చెన్నై వైపు బైక్‌పై ఓ వ్యక్తి వెళ్తూ తనిఖీలను చూసి బైక్‌ను వదిలి పారిపోయేందుకు యత్నించాడు. అప్రమత్తమైన అధికారులు అతని వెంటపడి పట్టుకున్నారు. వెంటనే అతని బైక్‌ను స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా 5.5  కిలోల గంజాయిని గుర్తించారు. 

మురుగన్‌ సీతారామన్‌గా గుర్తింపు

అధికారులకు దొరికిన వాంటెడ్‌ క్రిమినల్‌ తమిళనాడు కాంచీపురం జిల్లా పళన్‌తాంగాల్‌కు చెందిన మురుగన్‌ సీతారామన్‌గా గుర్తించారు. అతనిని విచారణ చేయగా తనపై గతంలో ఉన్న నేరచరితను బయటపెట్టాడు. మురుగన్‌పై మొత్తం 15 కేసులుండగా వాటిలో నాలుగు హత్య, మిగతావి దొమ్మీలు, దోపిడీ, బాంబు దాడి కేసులు. వాటిలో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు విచారణలో తేలింది. సమాచారం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు చెక్‌పోస్టుకు వచ్చి తాము వెతుకుతున్న నిందితుల ముఠాలో వ్యక్తిగా వారు నిర్ధారించారని ఎస్‌ఈబీ  సీఐ ప్రసాద్‌ తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐ రఘుసత్యనారాయణ,  సిబ్బంది చెంచయ్య, పోలయ్య, వేణుగోపాల్‌, హరిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T04:42:48+05:30 IST