‘ట్రావెల్ బబుల్’ ఆలోచనను వాయిదా వేసుకున్న థాయ్‌లాండ్

ABN , First Publish Date - 2020-08-07T01:20:51+05:30 IST

ఎంపిక చేసిన దేశాలతో ఒప్పందం కుదుర్చుకుని అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించాలన్న

‘ట్రావెల్ బబుల్’ ఆలోచనను వాయిదా వేసుకున్న థాయ్‌లాండ్

న్యూఢిల్లీ : ఎంపిక చేసిన దేశాలతో ఒప్పందం కుదుర్చుకుని అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించాలన్న ప్రతిపాదనలను థాయ్‌లాండ్ ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఆసియా దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 


కోవిడ్-19 కేసులు తక్కువగా ఉన్న దేశాలతో ‘ట్రావెల్ బబుల్’ ఒప్పందం చేసుకుని, పర్యాటకులను అనుమతించాలని జూన్‌లో థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండవలసిన అవసరం లేకుండా అనుమతించాలని భావించింది. 


థాయ్‌లాండ్ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ అధికార ప్రతినిథి తవీసిన్ విసనుయోథిన్ మాట్లాడుతూ, ట్రావెల్ బబుల్ ఏర్పాట్లపై చర్చలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఇతర దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జపాన్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియాలతో చర్చలు జరిపి, ట్రావెల్ బబుల్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావించినట్లు తెలిపారు. అయితే ఈ దేశాల్లో కూడా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల చర్చలను వాయిదా వేసినట్లు తెలిపారు. 


థాయ్‌లాండ్ ఆర్థిక వ్యవస్థ పర్యాటక రంగంపై అధికంగా ఆధారపడింది. ప్రస్తుతం గత కొన్ని దశాబ్దాల్లో ఎరుగని దయనీయ స్థితిలో ఉంది. ఈ దేశంలో 3,300 కోవిడ్-19 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ వైరస్ లోకల్ ట్రాన్స్‌మిషన్ జరుగుతున్నట్లు ఆధారాలు లేవు. 


పర్యాటక రంగంలో ఈ ఏడాదిలో దాదాపు 51.50 బిలియన్ డాలర్ల ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా. 


2019లో 3.98 కోట్ల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. 


Updated Date - 2020-08-07T01:20:51+05:30 IST