తైబజార్లో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి
ABN , First Publish Date - 2021-02-28T05:27:56+05:30 IST
మెదక్ మున్సిపల్ పరిధిలో తైబజార్ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించగా కౌన్సిలర్లు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ తైబజార్ను పూర్తిగా రద్దు చేసి మున్సిపల్ ద్వారానే వసూలు చేయాలని చైర్మన్ను కోరారు.
మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల డిమాండ్
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 27 : మెదక్ మున్సిపల్ పరిధిలో తైబజార్ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించగా కౌన్సిలర్లు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ తైబజార్ను పూర్తిగా రద్దు చేసి మున్సిపల్ ద్వారానే వసూలు చేయాలని చైర్మన్ను కోరారు. అదేవిధంగా పట్టణ ప్రగతి నిధులతో వైకుంఠధామాలను నిర్మించాలన్నారు. పట్టణంలో అనుమతి లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగుతున్నదని ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ పర్యవేక్షణ అనంతరం అనుమతులు జారీ చేయాల్సి ఉండగా అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. కౌన్సిలర్లకు తెలియకుండానే కాలనీలలో రోడ్డు విస్తరణలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తైబజార్ లీజు సమయం మార్చితో ముగుస్తుందని, తదనంతరం ప్రైవేటు వసూళ్లు చేయకుండా మున్సిపల్ ద్వారానే చేపట్టే విధంగా తీర్మానిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. అంతేగాకుండా వైకుంఠధామాల నిర్మాణాల విషయంలో సైతం తదుపరి మాసంలో నిధులు కేటాయిస్తామన్నారు. రాందా్సచౌరస్తాలో రూ.3 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ నిర్మించబోతోందని స్పష్టతనిచ్చారు. 15వ ఫైనాన్స్ ద్వారా మంజూరైన 2.37 కోట్లకు సంబంధించి వివిధ రకాల అభివృద్ధి పనులకు బల్దియా తీర్మానం చేసింది. సమావేశంలో కమిషనర్ శ్రీహరి, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.