పార్క్‌లో చెత్త వేస్తే.. పార్శిల్ ఇంటికొస్తుంది: థాయ్‌లాండ్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-22T00:03:32+05:30 IST

థాయ్‌లాండ్‌లో ఉన్న ఖావో యామ్ నేషనల్ పార్క్‌ పరిశుభ్రతపై అక్కడి ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఖాళీ బాటిళ్లతో, ప్లాస్టిక్ కవర్లతో

పార్క్‌లో చెత్త వేస్తే.. పార్శిల్ ఇంటికొస్తుంది: థాయ్‌లాండ్ ప్రభుత్వం

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఉన్న ఖావో యామ్ నేషనల్ పార్క్‌ పరిశుభ్రతపై అక్కడి ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఖాళీ బాటిళ్లతో, ప్లాస్టిక్ కవర్లతో టూరిస్టులు.. పార్కును నింపేయకుండా ఉండేందుకు థాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ సమీపంలో ఉన్న ఖావో యామ్ నేషనల్ పార్క్.. విభిన్న వన్యప్రాణులకు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఏటా ఈ పార్కును లక్షల మంది సందర్శిస్తుంటారు. పర్యాటకుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగానే సమకూరుతుంది. అయితే.. పార్కులో టూరిస్టులు.. ఖాళీ బాటిళ్లను, ప్లాస్టిక్ కవర్లను, చెత్తాచెదారాన్ని పడేస్తుండటంతో అది డంప్‌యార్డ్‌ను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్క్ పరిసరాలను పాడు చేయొద్దని.. పర్యాటకులకు ప్రభుత్వం పలుమార్లు సూచించింది. అయితే వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో థాయ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్కులో ఎవరైనా చెత్త వేస్తే.. వారు వేసిన చెత్తను వారింటికే పార్శిల్ పంపేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం పర్యాటకులు పార్కులోకి ఎంటర్ అయ్యే ముందే.. వారి చిరునామా సహా తదితర వివరాలను సేకరించాలని థాయ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆ దేశ మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా పార్క్ పరిసరాలను పాడు చేసిన వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 


Updated Date - 2020-09-22T00:03:32+05:30 IST