పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌

ABN , First Publish Date - 2022-07-05T05:00:03+05:30 IST

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌
పాఠ్యపుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తున్న డీఈవో రేణుకాదేవి


  • త ్వరలో విద్యార్థుల చేతికి టెక్ట్స్‌బుక్కులు 
  •  నేటి నుంచి  పంపిణీ 
  • మొదట మండల కేంద్రాలకు.. అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా 
  • పాఠ్య పుస్తకాల పంపిణీని  ప్రారంభించిన డీఈవో

వికారాబాద్‌, జూలై4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘వచ్చేదెన్నడో...ఇచ్చేదెన్నడో? పాఠ్యపుస్తకాలు, యూనిఫాం కోసం విద్యార్థుల ఎదురుచూపులు’ అనే శీర్షికన గతనెల 30వ తేదీన ఆంధ్రజ్యోతి ట్యాబ్లాయిడ్‌లో ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. మంగళవారం నుంచి శివారెడ్డిపేట పారిశ్రామికవాడలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాము నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 1107 ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1,07,788 విద్యార్థులు చదువుతున్నారు. ఈవిద్యా సంవత్సరంలో జిల్లాకు 6,40,170 పాఠ్యపుస్తకాలుఅవసరమవుతాయని అంచనా వేయగా,ఇప్పటివరకు 4,01,000 పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. ఇంకా 2,39,170 పాఠ్యపుస్తకాలు హైదరాబాద్‌లోని ముద్రణా కేంద్రం నుంచి రావాల్సి ఉంది. మొత్తం పాఠ్య పుస్తకాల్లో 75 శాతం పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరిన తరువాతనే పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభించాలని భావించినా.. మంగళవారం నుంచి శివారెడ్డిపేటలోని పాఠ్యపుస్తకాల గోదాం నుండి మండలాలకు సరఫరా చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టనున్నారు. సోమవారం డీఈవో రేణుకాదేవి వికారాబాద్‌ ఎంఈవో బాబుసింగ్‌కు పాఠ్యపుస్తకాలు అందజేసి జిల్లాలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.  మొదట మండల వనరుల కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తే, ఆ తరువాత అక్కడి నుంచి మండల పరిఽధిలోని పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. 

Updated Date - 2022-07-05T05:00:03+05:30 IST