కశ్మీరీ పండిట్ల నివాసాల వద్ద ఉగ్రదాడి
ABN , First Publish Date - 2022-10-03T09:11:18+05:30 IST
కశ్మీరులోని పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి దిగారు.
పోలీసు అధికారి మృతి.. మరో ఘటనలో లష్కరే ఉగ్రవాది హతం
శ్రీనగర్, అక్టోబరు 2: కశ్మీరులోని పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి దిగారు. కశ్మీరీ పండిట్లు నివాసం ఉంటున్న ప్రదేశంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం(నాకా టీం) గస్తీలో ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీవో) మృతి చెందగా.. సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉగ్రవాదులు పారిపోయారని.. వాళ్ల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల దుశ్చర్యను నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీలు ఖండించాయి. కాగా.. షోపియాన్ జిల్లాలోని బస్కుచాన్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన నసీర్ అహ్మద్ భట్గా గుర్తించామని ఏడీజీ విజయ్ కుమార్ తెలిపారు.