మేలో పది, ప్లస్ టూ పరీక్షలు - మంత్రి అన్బిల్ మహేష్
ABN , First Publish Date - 2022-01-25T18:05:25+05:30 IST
పది, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలు రానున్న మే నెలలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ప్రకటించారు. ఆయన సోమవారం నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక టి.నగర్ నార్త్ బోగ్ రోడ్డు సాయిబాబా ఆడిటోరియంలో
ప్యారీస్(చెన్నై): పది, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలు రానున్న మే నెలలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ప్రకటించారు. ఆయన సోమవారం నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక టి.నగర్ నార్త్ బోగ్ రోడ్డు సాయిబాబా ఆడిటోరియంలో మద్రాసు లైబ్రరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సంఘ సేవకులు డా.ఎన్.ఆవుడియప్పన్, డా.బి.రమేష్బాబు, డా.సుమతి, డా.విశ్వనాథన్ తదితరులకు మాల అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... కరోనా, ఒమైక్రాన్ వైరస్లను అదుపు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిందని, లాక్డౌన్కు సంబంధించి నిర్వహించే సమావేశంలో వైద్యనిపుణుల సలహాల మేరకు పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన పది, ప్లస్ వన్, ప్లస్ టూ తరగతుల సిలబస్ను పూర్తి చేయాల్సి ఉందని, అందువల్ల వచ్చే మేలో పరిస్థితిని బట్టి పది, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు. తంజావూరు విద్యార్థిని ఆత్మహత్య వ్యవహారాన్ని రాజకీయం చేయడం సరికాదని, విద్యార్థిని మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.