పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-05-17T06:02:53+05:30 IST
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పేపర్ లీకేజీలకు అవకాశం ఇవ్వొద్దని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానీయా సుచించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రశ్నాపత్రాలు కేంద్రాలకు చేరేంత వరకూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వీసీలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా
నిజామాబాద్ అర్బన్, మే 16: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పేపర్ లీకేజీలకు అవకాశం ఇవ్వొద్దని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానీయా సుచించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రశ్నాపత్రాలు కేంద్రాలకు చేరేంత వరకూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష ముగిసే చివరి అరగంట సమయంలో ఎక్కువగా అక్రమాలు జరుగుతాయని అవి జరగకుండా చూడాలని కోరారు. పరీక్షలు ప్రారంభమైన మీదట కేంద్రాల నుంచి ఏ విద్యార్థిని కూడా బయటకి అనుమతించొద్దని కోరారు. సీసీ కెమెరాల, పోలీసుల నిఘా మధ్య ప్రశ్నాపత్రాలు, ఎంఆర్ ఆన్సర్షీట్లకు తగిన భద్రత కల్పించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
ఈ నెల 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రగతిభవన్లో సోమవారం సంబంధితశాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 22,436 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. వీరిలో 22,413 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా 23 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారని ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం జిల్లాలో 153 కేంద్రాలు ఏర్పాటు చేశామ ని తెలిపారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ కోరారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ల వారీగా పోలీసు బందోబస్తు మధ్య తీసుకెళ్లాలని సూచించారు. అన్ని పరిక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆ సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదే శాలు ఇచ్చారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లో నియమించాలన్నారు. పరీక్షలు ఉన్న సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కోరారు. పరీక్ష కేంద్రాలకు బస్సులు నడపాలని అధికారులను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్, అధికారులు పాల్గొన్నారు.