పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-06-04T09:45:02+05:30 IST
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ పాణిని ఆదేశించారు
డీఈఓ పాణిని
బెజ్జూరు, జూన్3: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ పాణిని ఆదేశించారు. బుధవారం కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో గతంలో 35 కేంద్రాలు ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అదనంగా మరో 11 కేంద్రాలను పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ విద్యార్థులు మాస్కులు ధరించాలన్నారు.
గదుల్లో ప్రతి రోజు శానిటైజర్తో శుభ్రం చేయాలన్నారు. ఒక్కో బెంచీపై ఒక్క విద్యార్థి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. విద్యార్థులు అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. పదవ తరగతి పరీక్షల కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని తెలిపారు. విద్యార్థులు గంటకో మారు చేతులను శుభ్రం చేస్తుండాలని సూచించారు. వంట పాత్రలు, కూరగాయలను శుభ్రం చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో హాల్ టికెట్ల మార్పు జరగడంతో డీఈఓ వెబ్లో చూసుకోవాలన్నారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి జబ్బార్, ఎంఈఓ రమేష్బాబు, సీఆర్పీ శ్రీనివాస్, హెచ్ఎం పార్థిరాం తదితరులు ఉన్నారు.