ఇళ్ల కూల్చివేతతో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-11-30T05:34:09+05:30 IST
నగరంలోని బంగారుపేటలో కేసీ కెనాల్ వెంట ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది.
- ధర్నాకు దిగిన బాధిత కుటుంబాలు
- ప్రత్యామ్నాయం చూపుతాం: డీసీపీ
కర్నూలు(అర్బన), నవంబరు 29: నగరంలోని బంగారుపేటలో కేసీ కెనాల్ వెంట ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. కెనాల్ వెంట 500 మీటర్ల పొడవున ఉన్న దాదాపు 60 ఇళ్లు, రేకుల షేడ్లు, గుడిసెలు ఉండగా.. 25 షెడ్లు, ఇళ్లను ఎక్స్కవేటర్తో మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చి వేశారు. దీంతో బాధిత కుటుంబాలు ధర్నాకు దిగాయి. కొందరు మహిళలు తమ చేతులను కోసుకుంటామంటూ అధికారులు, పోలీసులను బెదిరించారు. అడ్డుపడిన వారిని పోలీసులు బయటకు లాక్కెళ్లారు. రింగ్ రోడ్డు కోసం కేసీ కెనాల్ వెంట నగర పాలక సంస్థ స్ధలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయించామని, వారికి ప్రత్యామ్నాయం చూపుతామని డీసీపీ కోటయ్య తెలిపారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశామన్నారు. బాధిత కుటుంబాలను రాయలసీమ పట్టణ నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు.