వెంకన్నపాలెంలో జగనన్న కాలనీకి స్థల సేకరణ లో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-08-19T06:33:42+05:30 IST
మండలంలోని వెంకన్నపాలెంలో బాలిబోయిన రమణమ్మ అనే మహిళ ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న 20 సెంట్ల భూమిని గురువారం రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు.
అడ్డుకున్న బాధితురాలు
బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
చోడవరం, ఆగస్టు 18: మండలంలోని వెంకన్నపాలెంలో బాలిబోయిన రమణమ్మ అనే మహిళ ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న 20 సెంట్ల భూమిని గురువారం రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబరు 432లో జగనన్న కాలనీ కోసం అధికారులు లేఅవుట్ వేశారు. అయితే ఈ లేఅవుట్కు ఆనుకుని బాలిబోయిన రమణమ్మ కుటుంబానికి సుమారుగా 50 సెంట్ల జిరాయితీ స్థలం ఉంది. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న 20 సెంట్ల బంజరులో యూకలిప్టస్ మొక్కలు నాటారు. జగనన్న కాలనీకి ఇళ్ల నిర్మాణాల కోసం అంటూ రెవెన్యూ అధికారులు బలవంతంగా రమణమ్మ ఆధీనంలో ఉన్న 20సెంట్ల స్థలాన్ని కూడా కలిపి లేఅవుట్ వేశారు. ఈ నేపథ్యంలో 20 సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ సిబ్బంది ఎక్స్కవేటర్తో చెట్లను తొలగించేందుకు ప్రయత్నించగా బాధితురాలు అడ్డుకుంది. ఎంతోమంది పెద్దలు ఆధీనంలో ఉన్న ఎకరాల భూములు వదలిపెట్టి తనలాంటి సామాన్యులు ఎంతోకాలంగా సాగు చేస్తున్న కొద్దిపాటి భూమిని లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని ఆమె అధికారులను అడ్డుకున్నారు. అయితే పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు 20సెంట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీఆర్వో మాట్లాడుతూ, రమణమ్మ స్థలం పూర్తిగా బంజరు అని, కాలనీ కోసం లేఅవుట్ వేసినందున స్థలం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా, వెంకన్నపాలెంలో చాలామంది బడాబాబులు ఆధీనం లో చాలా ఎకరాలు బంజరు ఉన్నా, వాటి గురించి పట్టించుకోని అఽధికారులు సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని పలువురు తప్పుపడుతున్నారు.