రుణ అన్వేషణకు సిద్ధం
ABN , First Publish Date - 2020-07-14T08:23:02+05:30 IST
రుణ అన్వేషణకు సిద్ధం
- త్వరలోనే సీమ స్కీంకు టెండర్లు
- జలవనరుల శాఖ సన్నాహాలు
అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరువు పీడిత రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేందుకు రూ.39,978 కోట్లతో చేపట్టనున్న రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకానికి టెండర్లను పిలవొచ్చని ఎన్జీటీ ఆదేశించడంతో రాష్ట్ర జల వనరుల శాఖ అందుకు సమాయత్తమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించడంతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణకు ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేసింది. ఈ పథకం కోసం రూ.5,000 కోట్లు చొప్పున రుణం కోరుతూ ప్రపంచ బ్యాంకు, ఏడీబీలకు ప్రాథమికంగా దరఖాస్తు చేసింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎ్ఫసీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) రూ.11,000 కోట్ల వరకు అప్పు ఇస్తాయని ఆశిస్తోంది. దేశీయంగా భారతీయ స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులకు కూడా రుణ ప్రతిపాదనలు పంపింది. ఈ పథకం కింద తొలి దశలో రూ.38.25 కోట్ల అంచనా వ్యయంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు టెండర్లు పిలుస్తారు.