రాజుగారి కల!

ABN , First Publish Date - 2021-04-23T05:30:00+05:30 IST

ఒకరోజు రాత్రి శ్రీకృష్ణదేవరాయలకు కలలో మాయా భవనం కనిపించింది. బంగారం, తళతళ మెరుస్తున్న రాళ్లతో నిర్మించిన ఆ భవంతిలో అన్ని వసతులు ఉన్నాయి. మరునాడు తన కలను సభికులకు వివరించి ‘‘అలాంటి భవనం నిర్మించిన వారికి వంద బంగారు నాణేలు బహుమానంగా ఇస్తాను’ అని ప్రకటిస్తాడు కృష్ణదేవరాయలు...

రాజుగారి కల!

ఒకరోజు రాత్రి శ్రీకృష్ణదేవరాయలకు కలలో మాయా భవనం కనిపించింది. బంగారం, తళతళ మెరుస్తున్న రాళ్లతో నిర్మించిన ఆ భవంతిలో అన్ని వసతులు ఉన్నాయి. మరునాడు తన కలను సభికులకు వివరించి ‘‘అలాంటి భవనం నిర్మించిన వారికి వంద బంగారు నాణేలు బహుమానంగా ఇస్తాను’ అని ప్రకటిస్తాడు కృష్ణదేవరాయలు. అలాంటి మేడను నిర్మించడం అసాధ్యమని తెలిసి అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇదే మాట రాజుకు చెప్పేందుకు ధైర్యం చాలక సభికులు తెనాలి రామకృష్ణుడిని సాయం కోరతారు. మరుసటి రోజు ఒక వృద్ధుడు ఏడుస్తూ కృష్ణదేవరాయల ఆస్థానానికి వస్తాడు. ‘ఏం జరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు?’ అని రాజు అడగగానే  ‘మహారాజా! నాకు న్యాయం చేయండి. నా సొమ్మంతా దొంగల పాలయింది’ అని చెబుతాడు. వెంటనే కృష్ణదేవరాయలు ‘ఎవరు నీ సొమ్ము దొంగిలించారో చెప్పు? నీకు న్యాయం జరిగేలా చూస్తాను’ అంటాడు. ‘నేను అతడి పేరు చెబుతాను. కానీ అతడిపై కోప్పడనని, అతడికి శిక్ష విధించనని ముందుగా మీరు నాకు మాట ఇవ్వండి’ అని వేడుకుంటాడు ఆ వృద్ధుడు. ‘నేను మాట ఇస్తున్నాను. ఎవరు నీ సొమ్ము దొంగిలించారో చెప్పు?’ అంటాడు కృష్ణదేవరాయలు.


‘మీరే మహారాజా! మీరే నా సొమ్ము ఎత్తుకెళ్లారు’ అంటాడు ఆ ముసలి వ్యక్తి. రాజుకు కోపం వస్తుంది. కానీ ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోతాడు. ‘నాకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది. మీరు సైనికులతో నా ఇంటికి వచ్చి నేను దాచుకున్న డబ్బునంతా దోచుకెళ్లారు’ అని చెప్పగానే కృష్ణదేవరాయలు కోపంతో ‘ముసలాయన నీకు పిచ్చి పట్టిందా! అది కల మాత్రమే. కలలు నిజం కావు’ అంటాడు. అందుకు ముసలి వ్యక్తి ‘రాజా! అద్భుతమైన భవంతిని కట్టాలన్న మీ కల నిజం అవుతున్నప్పుడు, నా కల ఎందుకు నిజం కాకూడదు?’ అని ప్రశ్నిస్తాడు.    తెనాలి రామకృష్ణుడు వృద్ధుడి వేషంలో వచ్చి తన పొరపాటును తెలివిగా గుర్తుచేశాడని గ్రహిస్తాడు కృష్ణదేవరాయలు. 


Updated Date - 2021-04-23T05:30:00+05:30 IST