తవ్వినకొద్దీ బయటపడుతున్న భారీ గుంత
ABN , First Publish Date - 2020-06-07T10:49:20+05:30 IST
మొన్న 14అడుగుల లోతు, నిన్న 17అడుగులు, శనివారం 20అడుగుల లోతు అంటున్నారు... జలమండలి
మొన్న 14అడుగులులోతు...
నిన్న 17అడుగుల లోతు... 92మీటర్ల పొడువు
శనివారం 25అడుగు లోతు... 100మీటర్ల పొడవు
పదేళ్ల క్రితం అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు
కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన జలమండలి జీఎం రాజశేఖర్
మియాపూర్, జూన్6(ఆంధ్రజ్యోతి): మొన్న 14అడుగుల లోతు, నిన్న 17అడుగులు, శనివారం 20అడుగుల లోతు అంటున్నారు... జలమండలి అధికారులు పరిశీలన, తవ్వుతున్న కొద్దీ బయట పడుతున్న రోడ్డు భారీ గుంతపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మియాపూర్ ప్రశాంత్నగర్లో మూడు రోజుల క్రితం ప్రధాన రహదారి ఆకస్మాతుగా కుప్పకూలిపోయి భారీ గుంత ఏర్పడింది. లోతు పరిస్థితి ఇలావుంటే ఈ లోతు ఇంకేత దూరం ఉంటుందనేది తెలియడం లేదు. దాదాపు పదేళ్ల క్రితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.200కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాలనకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అయితే ప్రణాళికలు రూపొందించడంలో విఫలమైన అధికారులు అప్పటి డ్రైనేజీ వ్యవస్థను నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని, అప్పటి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆరోపించారు. అనేక చోట్ల వేసిన డ్రైనేజీ పైపులైన్లకు ఔట్లేట్లు కలపకపోవడం, సివరేజ్ప్లాంట్ల నిర్మాణం సకాలంలో పూర్తికాకుండా న్యాయవివాదాలతో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండటం, నియోజకవర్గంలోని పలు బస్తీలు, ప్రధాన రహదారిలో వేసిన అండర్గ్రౌండ్ మ్యాన్హోల్స్ కుప్పకూలిపోవడం వంటివి అప్పట్లోనే వెలుగులోకి వచ్చాయి.
రూ.200కోట్ల నిధులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సక్రమంగా నిధులు ఖర్చు చేయలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పైపులైన్లు సరిగా వేయక పోవడం, మ్యాన్హోల్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే భారీ గుంత ఏర్పడిందన్న విషయం మూడు రోజుల్లోనే గుంత పరిమాణం, లోతు, వెడల్పులో అధికారులు పరిశీలించిన అనంతరం వెలుగులో వచ్చింది. తవ్విన కొద్దీ బయటపడుతున్న డ్రైనేజీ భారీ కుంభకోణం మూలంగా రాబోయే రోజుల్లో ఏ ప్రధాన రహదారిలో డ్రైనేజీ కుప్పకూలి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందని ఆయా కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే గాంధీ భారీ నిధులతో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాలనకు కృషిచేస్తున్నారు. ఇలాంటి పరిణామాల వల్ల అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన మార్చే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జలమండలి అధికారులు రెండునెలల క్రితమే జీహెచ్ఎంసీ నుంచి డ్రైనేజీకి సంబంధించిన విభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పనులు మొదలు పెట్టారు.
ఈ పనులు మొదలు పెట్టిన కొద్దిరోజులకే కరోనా ఎఫెక్ట్తో ప్రక్షాలనకు కావాల్సిన నిధులు కూడా కరువయ్యాయి. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి పైపులైను వేయడానికే నిధులు లేవని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారని పలు బస్తీల ప్రజలు చెబుతున్నారు. కొత్తలైన్లు వేయడానికి నిధులు లేకపోతే ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరిగితే నిధుల లేమితో ప్రజలకు శాపంగా మారే అవకాశం లేకపోలేదని పలువురు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్నగర్లో ఏర్పడిన గుంత దాదాపు 100మీటర్లు పొడవు, 25అడుగుల లోతులో తవ్వి పాతపైపులు తీసి కొత్తవాటిని వేసి కొత్తగా మ్యాన్హోల్స్ నిర్మాణం చేపట్టి 100మీటర్ల పొడవున కొత్తపైసులైను వేయాలని అధికారులు చెబుతున్నారు. శనివారం జలమండలి మేనేజర్ రాజశేఖర్, మేనేజర్ నాగప్రియ, తన సిబ్బందితో కలిసి కొత్తపైపులైను పనులు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నట్లు తెలిసింది.