10 lakh national flags: ఈద్గా మైదానంలో పంద్రాగస్టు వేడుకలు
ABN , First Publish Date - 2022-07-28T18:11:29+05:30 IST
నగరంలోని చామరాజపేట ఈద్గా మైదానంలో అమృత మహోత్సవంలో భాగంగా జాతీయజెండా(national flag) ఎగురవేస్తామని బీబీఎంపీ చీఫ్
- బీబీఎంపీ కమిషనర్
బెంగళూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నగరంలోని చామరాజపేట ఈద్గా మైదానంలో అమృత మహోత్సవంలో భాగంగా జాతీయజెండా(national flag) ఎగురవేస్తామని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్(Tushar Girinath) తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఘర్ ఘర్ తిరంగా’లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానించామన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరాదన్నారు. బెంగళూరులో 10 లక్షల జాతీయ పతాకాలను ఎగురవేసే ఆలోచన ఉందన్నారు. ప్రజలకు జాతీయ పతాకాలు పంపిణీ చేసే బాధ్యత పలువురు అధికారులకు అప్పగించామన్నారు. ప్రస్తుతానికి రెండు లక్షల జాతీయ పతాకాలు ఉన్నాయని మరో 8 లక్షలు సిద్ధమవుతున్నాయన్నారు. డివిజన్ల వారీగా జాయింట్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు(Revenue Officers), ఇంటింటికీ వెళ్లి జాతీయ పతాకాన్ని పంపిణీ చేస్తారన్నారు. ప్రజలు జాతీయ పతాకాన్ని కొనుగోలు చేసేలా నిర్ణయించామన్నారు. పెద్ద జెండాకు రూ.25, చిన్నజెండాకు రూ.10గా ధర నిర్ణయించామన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ జాతీయజెండాలు(national flag) ఎగురవేయాల్సి ఉన్నందున అనివార్యంగా పాలిస్టర్ జెండాలను కూడా అనుమతించాల్సి వచ్చిందన్నారు. చామరాజపేట మైదానానికి సంబంధించి హక్కుదారులు ఎవరనేందుకు, జాతీయజెండా ఎగురవేసేందుకు సంబంధం లేదన్నారు. మైదానానికి ప్రహరీ ఏర్పాటుకు ఓ ఏజెన్సీకి అప్పగించామన్నారు. నగరంలోని అన్నిప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు మదరసాలలోనూ ఆగస్టు 11 నుంచి 17వరకు జెండాలను ఎగురవేయాలని తీర్మానించామన్నారు. జిల్లా అధికారి శ్రీనివాస్, అదనపు పోలీస్ కమిషనర్ సందీప్పాటిల్, డీసీపీ శ్రీనివాస్గౌడ తదితరులు పాల్గొన్నారు.