ట్విటర్‌ డీల్‌కు తాత్కాలిక బ్రేక్‌

ABN , First Publish Date - 2022-05-14T08:30:55+05:30 IST

సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ను టేకోవర్‌ చేయాలన్న టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. స్పామ్‌, ఫేక్‌ (నకిలీ) ఖాతాల నిగ్గు తేల్చే వరకు ఈ డీల్‌ను.,.

ట్విటర్‌ డీల్‌కు తాత్కాలిక బ్రేక్‌

స్పామ్‌, నకిలీ ఖాతాల నిగ్గు తేల్చితేనే ముందుకు

 టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌  


లండన్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ను టేకోవర్‌ చేయాలన్న టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. స్పామ్‌, ఫేక్‌ (నకిలీ) ఖాతాల నిగ్గు తేల్చే వరకు ఈ డీల్‌ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. దీంతో 4,400 కోట్ల డాలర్ల (సుమారు రూ.34.09 లక్షల కోట్లు) ఈ డీల్‌ అమలుకు నోచుకుంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్విటర్‌ ఖాతాదారుల్లో దాదాపు ఐదు శాతం మంది స్పామ్‌ లేదా నకిలీ సభ్యులని రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇటీవల ప్రకటించింది. దీంతో ట్విటర్‌లో నిజమైన సభ్యులు ఎంత మంది? ఫేక్‌ సభ్యులు ఎంత మంది? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం తేలే వరకు ట్విటర్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని ‘తాత్కాలికం’గా పక్కన పెడుతున్నట్టు మస్క్‌ ట్వీట్‌ చేశారు. 


డీల్‌కు గుడ్‌బై!: మరోవైపు ఈ భారీ డీల్‌ నుంచి మస్క్‌ తప్పుకుంటారనే అనుమానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ట్విటర్‌ కొనుగోలు డీల్‌ ప్రకటించినప్పటి నుంచి మస్క్‌ నాయకత్వంలోని టెస్లా విద్యుత్‌ కార్ల (ఈవీ) కంపెనీ షేరు పతనబాట బాట్టింది. ట్విటర్‌ కొనుగోలు తమకు పెద్ద గుదిబండ అవుతుందని టెస్లా వాటాదారులు ముందు నుంచీ భయపడుతున్నారు. డీల్‌ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు మస్క్‌ ప్రకటించిన వెంటనే టెస్లా షేరు ఐదు శాతం పెరగటం గమనార్హం. ఇదే సమయంలో ట్విటర్‌ షేరు 18 శాతం నష్టపోయింది.. స్పామ్‌, నకిలీ ఖాతాల పేరుతో మస్క్‌, ట్విట్టర్‌ డీల్‌కు గుడ్‌బై చెప్పడం లేదా మరింత తక్కువ ధరకు ట్విటర్‌ను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్టు మార్కెట్‌ వర్గాల అంచనా. 


ఉద్యోగులపై వేటు: ట్విటర్‌ ఉద్యోగులపై వేటు కొనసాగుతోంది. జనరల్‌ మేనేజర్‌ స్థాయిలో ఉన్న ఇద్దరు పెద్ద ఉద్యోగులను తొలగించింది. కీలక బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగులను తప్ప, ఇతర ఉద్యోగ నియామకాలను పూర్తిగా పక్కన పెట్టింది. వేతనేతర ఖర్చులనూ తగ్గించుకుంటున్నట్టు ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన వృద్ధి, ఆదాయ అంచనాలు అందుకోలేక పోయినట్టు అగర్వాల్‌ తెలిపారు. 


ఏడాదిలో ట్విట్టర్‌ను మించిపోతాం : కూ

 ట్విటర్‌కు భారత్‌లో గట్టిపోటీ ఎదురవుతోంది. ఖాతాదారుల సంఖ్య విషయంలో వచ్చే 12 నెలల్లో ట్విటర్‌ను మించిపోతామని దేశీయ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కూ’ ప్రకటించింది. ప్రస్తుతం మూడు కోట్ల వరకు ఉన్న తమ యూజర్ల సంఖ్య ఈ ఏడాది చివరికి 10 కోట్లు మించిపోతుందని ‘కూ కంపెనీ’ సీఈఓ, వ్యవస్థాపకుడు అపరమేయ రాధాకృష్ణ చెప్పారు. కూ ప్రస్తుతం ఇంగ్లీషుతో పాటు హిందీ, కన్నడ, తెలుగు వంటి పది భారతీయ భాషల్లో తన సేవలు అందిస్తోంది. ఇంగ్లీషేతర ఖాతాదారుల పరంగా చూస్తే కూ ఇప్పటికే భారత్‌లో ట్విటర్‌ను మించిపోయినట్టు రాధాకృష్ణ తెలిపారు. 

Read more