‘ఆలయాల్లోనూ లౌడ్స్పీకర్ల శబ్దం తగ్గాలి’
ABN , First Publish Date - 2022-05-17T17:00:34+05:30 IST
ఆలయాల్లోనూ లౌడ్స్పీకర్ల శబ్దం తగ్గాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థస్వామిజీ అభిప్రాయపడ్డారు.
- సుప్రీం మార్గదర్శకాలను అందరూ పాటించాలి
- పెజావర మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామిజీ
బెంగళూరు: ఆలయాల్లోనూ లౌడ్స్పీకర్ల శబ్దం తగ్గాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థస్వామిజీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఉడిపిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని హిందువులకు సూచించారు. లౌడ్స్పీకర్ల విషయంలో అందరూ నిబంధనలకు కట్టుబడాలన్నారు. కారణాలు ఏవైనా ఎప్పటికాలమైనా ధర్మకేంద్రాలు మసీదులుగా మార్పు జరిగి ఉండవచ్చునన్నారు. ఏదైనా ఆలయాన్ని కొనుగోలు చేసి మసీదుగా మార్చి ఉంటే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ పూజలు చేసే స్థలమైనా విక్రయం జరిగిన తర్వాత మార్పు ఉంటే సమస్య కాదన్నారు. అయితే ఆక్రమణలతో మార్పు జరిగి ఉంటే వాటిని ఖండించాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం సాగుతున్న పరిణామాలను స్వాగతిస్తామని, కోర్టు తీర్పులను అందరూ పాటించాలన్నారు. గతంలో ఎలా జరిగిందో చర్చ అవసరం లేదని ప్రస్తుతం కోర్టు మార్గదర్శకాలను పాటించాలని హితవు పలికారు. పూజామందిరమైతే హిందువులకు, దర్గాలు ఉంటే ముస్లింలకు వదిలేయాలన్నారు. తప్పు జరిగి ఉంటే సరిదిద్దాలని, ఎవరూ సమర్థించుకోవడం సరికాదన్నారు. ఘర్షణలకు అవకాశం లేకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడం సముచితమన్నారు.