ఆలయాలకు భక్తుల తాకిడి
ABN , First Publish Date - 2020-11-30T05:28:40+05:30 IST
ఆలయాలకు భక్తుల తాకిడి
కీసర: కీసర ఆలయాల్లో భక్తుల తాకిడితో సందడి నెలకొంది. కార్తీక మాసం, అందులో ఆదివారం సెలవు రోజు కావడంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి, చీర్యాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయాలకు విచ్చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. కార్తీకమాసోత్సవం సందర్భంగా రామలింగేశ్వర స్వామికి శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించగా, లక్ష్మీనరసింహస్వామికి స్వర్ణకుంకుమార్చన నిర్వహించారు. ఈ మేరకు కార్తీకమాసం సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కరోనా నిబంధనల మేరకు అభిషేకాలకు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయం వెలుపల ఉన్న శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా చీర్యాల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు భౌతికదూరం పాటిస్తూ, శానిటైజ్ చేస్తూ ఆలయ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.