భానుడి భగభగ
ABN , First Publish Date - 2020-05-22T10:27:39+05:30 IST
జిల్లాలో గురువారం ఎండ మండిపోయింది. ఆంఫన్ ప్రచండ తుఫాన్ ప్రభావం జిల్లాపై
42.5 డిగ్రీల ఉష్ణోగ్రత
నేడు 43-44 డిగ్రీలు... వడగాడ్పులు
కావలిలో అత్యధికంగా నమోదయ్యే అవకావం
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : ఐఎండీ
నెల్లూరు(హరనాథపురం), మే 21 : జిల్లాలో గురువారం ఎండ మండిపోయింది. ఆంఫన్ ప్రచండ తుఫాన్ ప్రభావం జిల్లాపై లేకపోయినా దాని వల్ల వాతావరణం చల్లగా ఉంటుందని అందరూ భావించారు. అయితే భానుడు భగభగ మండుతున్నాడు. గురువారం 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే లాక్డౌన్ కారణంగా అత్యధిక శాతం జనాభా ఇళ్లలోనే ఉండటంతో కొంతవరకు తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి తట్టుకోగలుగుతున్నారు. కాగా, శుక్రవారం జిల్లాలో 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైయ్యే అవకాశం ఉందని ఐఎండీ(భారత వాతావరణ విభాగం) తెలిపింది.
ఈనెల 25 వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో దక్షిణ కోస్తాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ముఖ్యంగా కావలిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఈ నేపథ్యంలో నీరు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.