అరకు పార్లమెట్ తెలుగుమహిళ అధ్యక్షురాలు మృతి
ABN , First Publish Date - 2022-08-15T06:09:16+05:30 IST
మండలంలో పెదగూడ పంచాయతీ కేంద్రానికి చెందిన అరకు పార్లమెంట్ తెలుగుమహిళ అధ్యక్షురాలు కవెర్ల పద్మ (46) మృతి చెందారు.
అన్ని పార్టీల నాయకుల దిగ్ర్భాంతి
పద్మ అంత్యక్రియలకు తరలివచ్చిన ప్రముఖులు
ముంచంగిపుట్టు, ఆగస్టు 14: మండలంలో పెదగూడ పంచాయతీ కేంద్రానికి చెందిన అరకు పార్లమెంట్ తెలుగుమహిళ అధ్యక్షురాలు కవెర్ల పద్మ (46) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం అర్ధ రాత్రి తుది శ్వాస విడిచారు. పార్టీలకతీతంగా అందరితో కలసిమెలిసి ఉండే పద్మ లేరన్న విషయం తెలియడంతో వివిధ పార్టీల నాయకులు, మండల ప్రజలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించే పద్మ మృతి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఆదివారం స్వగ్రామం పెదగూడలో కన్నీటి సాగరం నడుమ ఆమె అంత్యక్రియలు జరిగాయి. టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహాం, టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సివేరి దొన్నుదొర, సర్పంచ్లు శివశంకర్, బాకూరు వెంకటరమణరాజు, పి.పాండురంగస్వామి, సత్యనారాయణ, జ్ఞానప్రకాష్, టీడీపీ రాష్ట్ర, ఎస్టీ సెల్ కార్యదర్శులు ఎ.తిరుపతి, జి.రామ్మూర్తి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు త్రినాథ్, సుకుమారి, మర్రిచెట్టు అప్పారావు, కె.భూషణ్రావు తదితరులు పద్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.