అమెరికాలో తెలుగు యువతి బలవన్మరణం
ABN , First Publish Date - 2021-03-05T12:54:52+05:30 IST
ఆరు నెలల ముందే వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 3న వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసి ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. ఇంతలో ఏమైందో ఏమో.. ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని వరుడు చెప్పడంతో మనస్తాపం చెందిన వధువు మూడు రోజుల క్రితం అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది.
ఖాయమైన పెళ్లి వద్దన్నాడు
మనస్తాపంతో అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య
చిత్తూరు, మార్చి 4: ఆరు నెలల ముందే వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 3న వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసి ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. ఇంతలో ఏమైందో ఏమో.. ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని వరుడు చెప్పడంతో మనస్తాపం చెందిన వధువు మూడు రోజుల క్రితం అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు నగరం పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ(24) అమెరికాలోని టెక్సాస్లో ఎంఎస్ చదువుతూ పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తోంది. పూతలపట్టు మండలం వడ్డేపల్లె పంచాయతీ బందార్లపల్లెకు చెందిన భరత్ అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే వీరిద్దరికీ పెళ్లి నిశ్చయమవడంతో ఈ నెల 3వ తేదీ ఉదయం 3 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పత్రికలు కూడా ముద్రించి పంచిపెట్టారు.
అయితే.. సుష్మను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని భరత్ తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విషయమై ఇరుకుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. అయినా భరత్ పెళ్లికి నిరాకరించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ సోమవారం అమెరికాలో తాను ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సుష్మ బంధువులు గురువారం చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.