Kuwait: తెలుగు మహిళను గదిలో బంధించి.. 4 రోజులుగా పస్తుపెట్టి తమ కోరిక తీర్చాలని ఒత్తిడి.. భర్తకు వీడియో..!

ABN , First Publish Date - 2022-05-31T12:41:57+05:30 IST

జీవనోపాధికోసం కువైత్‌ వెళ్లిన ఓ పేద మహిళను ఏజెంటు, అతని మిత్రుడు తమ కామవాంఛ తీరిస్తేనే మంచి ఇంట్లో పనికి కుదురుస్తామంటూ ఆమెను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు.

Kuwait: తెలుగు మహిళను గదిలో బంధించి.. 4 రోజులుగా పస్తుపెట్టి తమ కోరిక తీర్చాలని ఒత్తిడి.. భర్తకు వీడియో..!

కువైత్‌లో మహిళకు లైంగిక హింస

ఏజెంటు, అతడి మిత్రుడి దురాగతం

భర్తకు వీడియో పంపిన తిరుపతి మహిళ

ఎర్రావారిపాలెం(తిరుపతి), మే 30: జీవనోపాధికోసం కువైత్‌ వెళ్లిన ఓ పేద మహిళను ఏజెంటు, అతని మిత్రుడు తమ కామవాంఛ తీరిస్తేనే మంచి ఇంట్లో పనికి కుదురుస్తామంటూ ఆమెను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆహారం, నీరు అందించకుండా పస్తు పెట్టి.. దురాగతానికి పాల్పడ్డారు. బాధిత మహిళ తన భర్తకు సోమవారం రాత్రి తన దుస్థితిని వీడియో తీసి ఫోన్‌ ద్వారా పంపించారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లె పంచాయతీకి చెందిన ఓ మహిళ(26) ఈనెల 24న కువైత్‌ వెళ్లారు. చెంగల్‌ రాజు అనే ఏజెంట్‌ ఆమె గల్ఫ్‌ చేరేందుకు సహకరించాడు. 


అక్కడికెళ్లాక ఓ ఇంట్లో పనికి కుదిర్చారు. అక్కడ బాగోలేకపోవడంతో ఇల్లు మార్చమని ఆమె కోరింది. ఏజెంట్‌ చెంగల్‌రాజు, అతడి మిత్రుడు బావాజీ ఇదే అదునుగా ఆమెను అక్కడ ఓ గదిలో బంధించారు. తమ కోరిక తీరిస్తేనే ఇంకో ఇంట్లో పనికి కుదురుస్తామని హింసించారు. నాలుగు రోజులుగా తిండి కూడా పెట్టకుండా నీళ్లు మాత్రమే ఇస్తున్నారని బాధితురాలు భోరున విలపించింది. సోమవారం రాత్రి 10 గంటలకు తిరుపతిలోని తన భర్తకు వీడియో పంపింది. తనను ఎలాగైనా తిరుపతికి తీసుకొచ్చేయమని వేడుకుంది. ఈ విషయమై బాధితురాలి భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-05-31T12:41:57+05:30 IST