కాలితో తన్నారు.. తలపై తుపాకీ పెట్టి బెదిరించారు.. చుక్కలు చూపారు
ABN , First Publish Date - 2022-03-01T13:38:52+05:30 IST
ఆకలిదప్పులు ఓర్చుకుని.. ఎముకలు కొరుకుతున్న చలిని తట్టుకుని.. బాంబుల మోతను గుండె ధైర్యంతో భరించి.. కిలోమీటర్ల కొద్దీ నడిచి.. బతుకు జీవుడా అంటూ ఉక్రెయిన్ నుంచి సొంతగడ్డకు చేరుకుంటున్నారు తెలుగు విద్యార్థులు.
సరిహద్దుల్లో మాలా వేలాదిమంది.. తెలంగాణ చేరుకున్న విద్యార్థుల వెల్లడి
హైదరాబాద్ సిటీ, జీడిమెట్ల, శంషాబాద్ రూరల్, భద్రాచలం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఆకలిదప్పులు ఓర్చుకుని.. ఎముకలు కొరుకుతున్న చలిని తట్టుకుని.. బాంబుల మోతను గుండె ధైర్యంతో భరించి.. కిలోమీటర్ల కొద్దీ నడిచి.. బతుకు జీవుడా అంటూ ఉక్రెయిన్ నుంచి సొంతగడ్డకు చేరుకుంటున్నారు తెలుగు విద్యార్థులు. ఎదుర్కొన్నది ఎంత కష్టమో? అని అంటున్నారు. విమానాల రద్దు.. రైళ్ల నిలిపివేత నడుమ ప్రయాణం ఎలాగని ఆందోళన చెందినవీరంతా ఇప్పుడు హమ్మయ్య అనుకుంటున్నారు. వందలాది మంది తెలుగు విద్యార్థులు అక్కడే చిక్కుకున్నారని, వారిని రప్పించాలని కోరుతున్నారు.
తలపై తుపాకీ పెట్టి బెదిరించారు
బంకర్లు, సురక్షిత ప్రాంతాల్లో గడిపాం. భారత్కు రావాలని బస్ పట్టుకొని 4 గంటల తర్వాత రొమేనియా సరిహద్దులకు చేరుకున్నాం. అక్కడ ఉక్రెయిన్ సైన్యం తలపై తుపాకీ గురి పెట్టి చంపేస్తామని బెదిరించింది. ఉక్రెయిన్ విద్యార్థులను త్వరగా పంపించేస్తున్నారు. మనవాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు ప్రశ్నిస్తే కాలుతో తన్నారు. 8 గంటలు బిక్కుబిక్కుమంటూ గడిపాం. - విష్ణువర్ధన్, నల్లగొండ
2 రోజులు చలిలోనే
ఉక్రెయిన్ సరిహద్దులో రెండు రోజులు చలిలోనే ఉన్నాం. అక్కడి అధికారులు పట్టించుకోలేదు. యూనివర్సిటీ అధికారులు సరిహద్దుల వరకు తరలించారు. కానీ అక్కడ ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. వేలాదిమంది ఒకేసారి గుమిడూడారు. తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. - నిషారాణి, శంషాబాద్
బాంబు పేలుళ్లతో భయాందోళన
బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. బాంబుల శబ్దంతో అంతా భయభ్రాంతులకు గుర య్యాం. బిల్డింగ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. నేనూ చనిపోతాననే భయం పట్టుకుంది. దేవుడి దయతో ఇంటికి చేరుకున్నా. -నిహారిక, మహబూబ్నగర్
ఆహారం లేకుండా..
చెర్నివ్ట్నీ నగరం నుంచి ఈ నెల 26న ఉదయం రైలులో కీవ్ ఎయిర్పోర్టుకు బయలు దేరాం. ఆ ట్రైన్ మధ్యలోనే నిలిచిపోయింది. యూనివర్సిటీ వాళళ్ల బస్సుల్లో మళ్లీ క్యాంప్సకు చేర్చారు. రాత్రి 7.30 గంటలకు రొమేనియా రాజధాని బుకారె్స్టకు తరలించారు. అప్పటిదాకా ఆహారం లేదు. బుకారె్స్టలో తీవ్ర చలితో వణికిపోయాం. -కామని భానుశ్రీ, కృష్ణనగర్, మౌలాలి
బంకర్లో కల్పన.. తల్లిదండ్రుల బెంగ
హైదరాబాద్ షాపూర్నగర్కు చెందిన మురళి, పుష్ప దంపతుల కుమార్తె కల్పన ఉక్రెయిన్లోని క్లొచివ్స్కాయాలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతోంది. బంకర్లో తలదాచుకుంటోంది. మైనస్ డిగ్రీల చలిలో, సరైన ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపింది.
37 కిలోల బరువుతో.. ఐదు కి.మీ. నడక
కీవ్లో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. ఈ నెల 24నే భారత్ వచ్చేందుకు విమానం ఎక్కాల్సి ఉంది. సహచరులతో ఎయిర్పోర్టుకు చేరుకున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. యుద్ధం రావడంతో కీవ్ ఎయిర్పోర్టులో రాకపోకలు స్తంభించాయి. ఈ క్రమంలో 550 కి.మీ. వెనక్కి ప్రయాణించాల్సి వచ్చింది. భారత ఎంబసీ సూచనతో రొమేనియా సరిహద్దుకు చేరేందుకు బయల్దేరాం. ట్రాఫిక్తో సరిహద్దుకు ఐదు కి.మీ. దూరంలో నిలిచిపోయాం. 37 కిలోల లగేజీతో కాలినడక సాగించా. -భద్రాచలం యువకుడు వివేక్
రాష్ట్రానికి మరో 11 మంది చేరికఉక్రెయిన్ నుంచి మరో 11 మంది వైద్య విద్యార్థులు సోమవారం తెలంగాణకు చేరుకున్నారు. 250 మంది విద్యార్థులతో ఢిల్లీ వచ్చిన ప్రత్యేక విమానంలో వీరంతా ప్రయాణించారు. శంషాబాద్ విమానాశ్రయంలో పిల్లల్ని చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. కాగా, హైదరాబాద్కు వచ్చిన పలువురు విద్యార్థులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా్షగౌడ్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి వికా్సరాజ్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు రిసీవ్ చేసుకున్నారు.