నాసా’ పోటీల్లో మనోళ్ల సత్తా
ABN , First Publish Date - 2021-08-23T11:46:12+05:30 IST
చంద్రుడిపై చేపట్టే పరిశోధనల్లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) నిర్వహించిన పోటీల్లో రాష్ట్రానికి చెందిన యువకుల బృందం సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో వెయ్యికిపైగా బృందాలు పాల్గొనగా
బ్రేక్ ది ఐస్ లూనార్ చాలెంజ్’లో తెలుగు యువకుల ప్రతిభ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):చంద్రుడిపై చేపట్టే పరిశోధనల్లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) నిర్వహించిన పోటీల్లో రాష్ట్రానికి చెందిన యువకుల బృందం సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో వెయ్యికిపైగా బృందాలు పాల్గొనగా, తెలుగు యువకుల బృందం టాప్-10లో నిలిచి 25 వేల డాలర్లు(సుమారు రూ.18.8 లక్షలు) గెల్చుకోవడంతోపాటు రెండోదశ పోటీలకు ఎంపికైంది. చంద్రునిపై ఉన్న మంచును నీరుగా మార్చే చర్యల్లో భాగంగా ‘నాసా’ గత ఏడాది నవంబరులో ఈ పోటీలకు శ్రీకారం చుట్టింది.
‘బ్రేక్ ది ఐస్ లూనార్ చాలెంజ్’ పేరుతో చేపట్టిన పోటీలకు ఔత్సాహిక పరిశోధకుల నుంచి ప్రాజెక్ట్లను ఆహ్వానించింది. దీంతో వెయ్యికిపైగా ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 48 దేశాలకు చెందిన 374 ప్రాజెక్టులను పోటీలకు ఎంపిక చేసింది. రాష్ట్రానికి చెందిన కరణం ఆశీష్ కుమార్, అమరేశ్వర ప్రసాద్ చుండూరు, ప్రణవ్ ప్రసాద్(అమెరికాలో ఉంటున్న తెలుగు యువకుడు) రూపొందించిన ఎల్-వాటర్(లూనార్ వాట ర్ అబ్స్ర్టాక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బై ఎక్సకవేషన్ ఆఫ్ రెగోలిత్) ప్రాజెక్ట్ టాప్-10లో నిలిచింది. 25 వేల డాలర్లను బహుమతిగా గెల్చుకోవడంతో పాటు రెండో దశ పోటీలకు ఎంపికైంది.