వాహనం లోయలోపడి..తెలుగు సైనికుడి మృతి
ABN , First Publish Date - 2021-02-23T08:30:46+05:30 IST
దేశరక్షణకై సైన్యంలో చేరి ఊహించని ప్రమాదంలో అశువులుబాసిన సైనికుడు పొలుగంటి శివగంగాధర్ (28) అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో జరిగాయి. కర్నూలు జిల్లా కొత్తపల్లి
చైనా సరిహద్దులో ప్రమాదం
స్వగ్రామానికి చేరిన భౌతిక కాయం
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఆత్మకూరు/కొత్తపల్లి, ఫిబ్రవరి 22: దేశరక్షణకై సైన్యంలో చేరి ఊహించని ప్రమాదంలో అశువులుబాసిన సైనికుడు పొలుగంటి శివగంగాధర్ (28) అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో జరిగాయి. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన రాముడు, రాములమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివగంగాధర్ 2017లో భారత ఆర్మీలో చేరారు. భారత్-చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో విధులు నిర్వహించేవారు. ఈ నెల 18న ఆయన ప్రయాణించే ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతున్న లోయలో పడిపోవడంతో శివ మృతి చెందారు. భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్కు తరలించి అక్కడి నుంచి ఆయన స్వగ్రామం గువ్వలకుంట్లకు తీసుకొచ్చారు. నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, కర్నూలు ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆత్మకూరు డీఎస్పీ శృతి, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి రాచయ్య భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. శివగంగాధర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
పెళ్లయిన మూడు నెలలకే..
శివగంగాధర్కు గతేడాది నవంబరు 26న ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమదేవపల్లి గ్రామానికి చెందిన రాధికతో వివాహమైంది. పెళ్లి నిమిత్తం రెండు నెలలు పాటు సెలవుపై వచ్చిన శివగంగాధర్.. జనవరి 18న తిరిగి విధులకు హాజరయ్యారు. అప్పటి నుంచి రోజూ ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులు, భార్యతో మాట్లాడేవారు. తండ్రి రాముడు ఆరోగ్యం జాగ్రత్త అని పదేపదే సూచించేవారు. మరో నెలరోజుల్లో ఇంటికొస్తానని శివ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ భార్య రాధిక రోదించడం అందర్నీ కంటతడి పెట్టించింది.