అమరావతి కోసం విదేశీ గడ్డపై గర్జించిన తెలుగు బిడ్డ

ABN , First Publish Date - 2020-07-04T20:18:36+05:30 IST

అనుభవరాహిత్యపు ఒక్క నిర్ణయం 29వేల మందిని రోడ్డున పడేసింది. 6 కోట్ల మంది కలలను చిదిమేసింది. ప్రపంచంలో ప్రతిదేశమూ కీర్తించే సింగపూర్ వంటి దేశాన్ని ఒప్పించి అమరావతిలో భాగస్వామిని చేస్తే రియల్ వ్యాపారం అంటూ తరిమేశారు.

అమరావతి కోసం విదేశీ గడ్డపై గర్జించిన తెలుగు బిడ్డ

నుభవరాహిత్యపు ఒక్క నిర్ణయం 29వేల మందిని రోడ్డున పడేసింది. 6 కోట్ల మంది కలలను చిదిమేసింది. ప్రపంచంలో ప్రతిదేశమూ కీర్తించే సింగపూర్ వంటి దేశాన్ని ఒప్పించి అమరావతిలో భాగస్వామిని చేస్తే రియల్ వ్యాపారం అంటూ తరిమేశారు. ప్రపంచంలో ఏ ఖండంలో అయినా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే దేశం మన గడపకు వచ్చి అండగా నిలబడితే  జగన్ సర్కారు ఇచ్చిన మర్యాద అది.


వడ్డించిన విస్తరాకు వంటి అమరావతిని కాదని ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం... ఒక రాజధాని మార్పు నిర్ణయం మాత్రమే కాదు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని సమూలంగా కాల్చేసిన దావానలం. ఆంధ్రుల తరతరాల భవిష్యత్తుకు నిర్మించిన పునాదులనే కూల్చేసిన ఘట్టం. త్యాగం అనే పదానికి వేసిన యమపాశం. ప్రభుత్వంపై మరెప్పటికీ ప్రజలకు నమ్మకం కలగకుండా చేసినా ఒక తప్పుడు తీర్పు. 


ఈ తప్పుడు నిర్ణయాన్నిచారిత్రక తప్పిదం కానీయరాదని ఆనాడే అమరావతి పోరు మొదలైంది. ఆ ఉద్యమానికి నేటికి సరిగ్గా 200 రోజులు. అందుకే అమరావతి కోసం ఆంధ్ర కదిలింది. బంగరు పంటలు పండే భూములను నయా పైసా లేకుండా రాజధానికి ఇచ్చేసిన రైతుల త్యాగం వృథా కానీయకుండా ప్రతి తెలుగు బిడ్డ కదిలాడు. ప్రపంచం నలుమూల విస్తరించిన ప్రతి ఎన్నారై ఆంధ్రుడు మీతో నేనున్నానంటూ తన సంఘీభావం తెలిపారు. కోవిడ్ కష్టాల్లోను ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ ప్రపంచం మొత్తం ప్రతి మూల నుంచి అమరావతి నినాదం వినిపించింది.


చిరుదివ్వెలా మొదలైన ఆలోచన ఖండంతారాలకు పాకిందిలా...

వేలమంది రైతులు సుదీర్ఘంగా చేస్తున్న నిర్విరామ ఉద్యమం ఇది. వారి తెగువ, ఆవేదనకు అందరూ అండగా నిలుస్తున్నారు ఎన్నారైలు. రైతు బిడ్డలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన ఆంధ్రులు అమరావతి రైతులతో గొంతు కలిపారు. రైతుల పోరాటానికి  200 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలుద్దాం అని అమెరికాలోని ఎన్నారైలందరికీ పిలుపునిచ్చారు. ఓ మోస్తరు మద్దతు వస్తుందనుకుంటే... కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు.... చిన్న లేదు, పెద్ద లేదు. ఆడ లేదు, మగ లేదు... ఏ బేధ భావాలు లేకుండా ప్రతి ఒక్కరు ఒక రాష్ట్రం ఒకే  రాజధాని అంటూ నినదిస్తూ ముందుకు వచ్చారు.


200 రోజులకు చిహ్నంగా 200 నగరాల్లో నిరసన తెలుపుదాం అనుకుంటే అది అమెరికాలోనే 230 నగరాలు అయ్యింది. మిగతా ఖండాల్లో ఉన్న ఎన్నారైలు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. చిరుదివ్వెలా మొదలైన ఆలోచన ప్రచండ భానుడిలా మారింది. దీంతో ఒక్కో ఎన్నారై అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో భారీ ఎత్తున ఎన్నారైలు కదిలివచ్చారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా కదిలిరావడం చూసి... అమరావతికి ఇంత ప్రజా మద్దతు ఉందా అని పాలకులే విస్తుపోయే పరిస్థితి.


శృతి తప్పని సంఘీ భావం 

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనేే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విశేషం. ఆయా దేశాల్లో స్థానిక ప్రభుత్వాలు అనుమతించిన సంఖ్యలోనే ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరావతికి తమ సంఘీభావం తెలిపారు. వివిధ నగరాల్లోని ఎన్నారైలు స్థానిక నిబంధనలు అనుసరిస్తూ ఒక్కోచోట 15-20 మందికి మించకుండా ఈ నిరసనలో పాల్గొనాలని జయరాం కోమటి పిలుపునిచ్చారు. అయితే... కరోనా వల్ల పాల్గొనలేకపోయిన వారు కూడా స్వతంత్రంగా ఇంటివద్దే మద్దతు తెలుపుతూ పాల్గొనడం అనూహ్యస్పందనకు ఓ చిహ్నం. 


ప్రతి నగరంలో ఊహించిన దానికంటే ఎక్కువగా మద్దతు దొరికింది. వేలల్లో వస్తారనుకుంటే లక్షకు పైగా కదిలి వచ్చారు. అమెరికాలోని అన్ని నగరాలతో పాటు  యుకె, ఐర్లండ్, కువైట్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, కెనడా, సింగపూర్, సౌదీ అరేబియా తదితర దేశాలలోని అనేక నగరాల నుంచి తెలుగు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  జూమ్ కాల్ ద్వారా జులై 3 రాత్రి 9 గంటలకు క్యాండిల్ లైట్ నిరసన (వెలుగు పూల సంఘీభావం) తెలుపుతూ డోంట్ కిల్ అమరావతి, బిల్డ్ అమరావతి అంటూ ఎన్నారైలు నినాదించారు.


అమరావతి మన రాజధాని మాత్రమే కాదు, మన భవిష్యత్తు అంటూ నినదించారు. వీరిది ఒకే కులం కాదు, ఒకే ప్రాంతం కాదు, ఒకే జిల్లా కాదు... కానీ ఒక్కటే కోరిక, ఒక్కటే సంకల్పం... అదే అమరావతి. అందరి కోరిక ఒక్కటే.... ఆంధ్రులకు గర్వకారణం అయిన అమరావతి తరతరాలు విలసిల్లే నగరంగా రూపుదిద్దుకోవాలని!  


ఈస్థాయిలో ఎన్నారైలందరూ ఏకమై నినాదించడం గతంలో ఎన్నడూ జరగలేదు.  ఒక రాష్ట్రం - ఒకే రాజధాని నినాదం అందరినీ ఏకం చేసింది. దీంతో కార్యక్రమం భారీగా విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమం సక్సెస్ వెనుక కోర్ కమిటీ కృషి ఎంతో ఉంది. సిటీ కోఆర్డినేటర్లు 24X7 పడిన కష్టం ఎనలేనిది. వీరందరి సమన్వయం వల్లే ఇది ఈ స్థాయిలో విజయవంతం అయ్యింది. సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.

Updated Date - 2020-07-04T20:18:36+05:30 IST