TAL: 'తాళ్' ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా తెలుగు మాతృ భాషా దినోత్సవం

ABN , First Publish Date - 2022-09-04T19:01:07+05:30 IST

భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, వాడుక భాషా ఉద్యమనాయకుడు, తాత్వికుడు గిడుగు శ్రీరామమూర్తి జయంతిని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఘనంగా నిర్వహించింది.

TAL: 'తాళ్' ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా తెలుగు మాతృ భాషా దినోత్సవం

లండన్: భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, వాడుక భాషా ఉద్యమనాయకుడు, తాత్వికుడు గిడుగు శ్రీరామమూర్తి జయంతిని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హాజరయ్యారు. తాళ్ ట్రస్టీ గరిధర్ వెంయక్యకు స్వాగతం పలుకుతూ వేదిక మీదకు ఆహ్వానించారు. తాళ్ సలహాదారులు డా. రాములు దాసోజు వెంకయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బి. రామనాయుడు మాట్లాడుతూ ఆయన 50ఏళ్ల రాజకీయ జీవితం నమ్మిన ఆశయాలకు, విలువలకు అనుగుణంగా నడిపించిందని చెప్పారు. ప్రఖ్యాత రాజకీయ వేత్తగా ప్రభావశీలమైన వక్తగా, విద్యార్థి కాలం నుండి రాజకీయాలో తర్ఫీదు పొంది నాయకుడిగా ఎదిగారు అని కొనియాడారు. 


తాళ్ చైర్మన్ భారతి కందుకూరి మాట్లాడుతూ తాము లండన్‌లో గత పదేళ్లుగా రెండు తెలుగు కల్చరల్ సెంటర్స్ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వీటిలో తెలుగు భాష, సంగీతం, నృత్యాలు నేర్పుతున్నామని చెప్పారు. అంతేగాక తాళ్ సీపీ బ్రౌన్ సమాధిని పునరుద్ధరించి నడుపుతున్న విషయాన్ని కూడా తెలియజేశారు. వేసవిలో రెండు నెలలు తాళ్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుందని, దీంతో పాటు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలుగువారి పెద్ద పండుగలైన ఉగాది, సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దాదాపు 100 మంది కార్యకర్తలు ఇందులో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 


తాళ్ సభ్యులు గిరి ధవళ మాట్లాడుతూ.. గిడుగు భాషా వేత్తగా ఎంత గొప్ప కృషి చేశారో, సంఘసంస్కర్తగా కూడా ఎంతో పోరాడారని చెప్పారు. సవర భాషకు చేసిన సేవ గొప్పదంని ప్రశంసించారు. అంతకంటే ముఖ్యంగా పేరు ప్రఖ్యాతి గురించి పనిచేయలేదని, గొప్ప మనావీయ విలువలున్న మనిషిని అని అన్నారు. భాషా సంస్కృతులే భవిష్యత్తులో మన చిరునామాను తెలియజేస్తాయని, అలాంటి భాషను, సంస్కృతిని కాపాడుకోవడమే తెలుగు భాషా దినోత్సవ సంకల్పం కావాలని ముఖ్య అతిథి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని వారి స్మృతికి నివాళులు అర్పించిన వెంకయ్య, ప్రతి ఒక్కరికీ మాతృభాషను చేరువ చేయాలన్న గిడుగు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అమ్మభాషను కాపాడుకునేందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. 


భారతదేశం స్వరాజ్యం సంపాదించుకున్న 75 ఏళ్లలో విదేశాల సామాపిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో భారతీయులు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్న వెంకయ్య.. ముఖ్యంగా భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటీష్ గడ్డ మీద భారతీయులకు ఈ రోజు అందుతున్న గౌరవం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. వసుధైవ కుటుంబం భావనను బలంగా నమ్మిన భారతీయులు సనాతన కాలం నుంచి కోరుకున్న నిజమైన పురోభివృద్ధి ఇదేనని పేర్కొన్నారు. మన భాషా సంస్కృతులను కాపాడుకుంటూ, ముందు తరాలకు చేరవేయాలన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ సంస్థకు అభినందనలు తెలియజేశారు. కాలానుగుణంగా లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆదర్శనీయమని తెలిపారు. 


దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, ఈ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మార్చారన్న వెంకయ్య ఈ భావన మానవాళి పురోభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ వేడుక లక్ష్యం, వేడుకలు చేసుకోవడం మాత్రమే కాదని, స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానీయుల ప్రేరణను ముందు తరాల్లో నింపటమని స్పష్టం చేశారు. అతి బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న భారత్, గత 75 ఏళ్లలో వ్యాక్సిన్ కోసం విదేశాల మీద ఆధారపడే స్థాయి నుంచి దేశ విదేశాలకు టీకాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం నిజమైన పురోగతి అని అన్నారు. 


భాష అంటే మనం మాట్లాడే నాలుగు పలుకులే కాదన్న వెంకయ్యనాయుడు మన పిల్లలకు మన భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దటం మాత్రమేగాక మన పండుగల్లోని పరమార్థాన్ని తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు గ్రంథ పఠనాన్ని ప్రోత్సహించాలన్న ఆయన తెలుగు కవులు నవ్యమార్గంలో యువతకు దిశానిర్ధేశం చేశారని తెలిపారు. మన ప్రాచీన గ్రంథాల్లో మన సంస్కృతి మాత్రమేగాక, సాంఘీక జీవనం కూడా భాగమై ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కాపాడుకోవడంతో పాటు నలుగురికీ సాయం చేయడం మరవొద్దని వెంకయ్యనాయుడు అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ప్రవాస భారతీయులు చూపిన చొరవ దేశం మరువదని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కార్యనిర్వాహక వర్గంతో పాటు బ్రిటన్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి. 






Updated Date - 2022-09-04T19:01:07+05:30 IST