మోసకారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
ABN , First Publish Date - 2021-02-25T06:33:28+05:30 IST
అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.
సీపీఎస్ రద్దు హామీ ఏమైంది?
యూనియన్ల నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదు
ఉద్యోగులకు ఎనిమిది డీఏలు పెండింగ్
ఉద్యోగాల పేరుతో యువతకు మోసం
జగన్మోహన్రెడ్డి పరిపాలన తీరుపై
మాజీ మంత్రి అయ్యన్న ఫైర్
నర్సీపట్నం, ఫిబ్రవరి 24 : అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. బుధవా రం స్థానిక విలేఖరులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని పాదయాత్ర బహిరంగ సభల్లో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 80వారాలు గడుస్తున్నా సీపీఎస్ రద్దు చేయలేదని, యూనియన్ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.
చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు గౌరం
ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒక డీఏ ఇస్తారని, ఇప్పటి వరకు ఎనిమిది డీఏ బకాయిలు పేరుకుపోయాయని అయ్యన్న వివరించారు. ఉద్యోగ సంఘాలు అడిగితే ఒక డీఏ ఇవ్వడానికి అంగీకరించారని, అదీ వాయిదాల పద్ధతినని ఎద్దేవా చేశారు. అలాగే, పీఆర్సీ విషయంలో కూడా మోసం చేశారన్నారు. చంద్రబాబు ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో బ్రాందీషాపుల వద్ద కాపలాపెట్టడం అందరం చూశామన్నారు. 24 ఎంపీలు ఇస్తే మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని యువతను మోసం చేశారని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాల పేరుతో మోసం చేశారన్నారు. పార్టీ కోసం రూ.5వేల జీతంతో వలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు.