ఆ రోజున Telegram పంట పండింది
ABN , First Publish Date - 2021-10-07T22:46:48+05:30 IST
ఫేస్బుక్ సేవలు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరుగంటలపాటు ఆగిపోవడం మెసేజింగ్ యాప్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ సేవలు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరుగంటలపాటు ఆగిపోవడం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు కలిసొచ్చింది. ఏకంగా 70 మిలియన్ల మంది కొత్త యూజర్లు దానికి వచ్చి చేరారు. ఫేస్బుక్ సంస్థ నుంచి సేవలు నిలిచిపోవడంతో టెలిగ్రామ్కు రికార్డు స్థాయిలో కొత్త ఖాతాదారులు వచ్చి చేరినట్టు దాని సీఈవో సీఈవో పావెల్ దురోవ్ పేర్కొన్నారు. ఆ ఒక్క రోజు ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి ఏకంగా 70 మిలియన్ల మంది వచ్చి చేరారని తెలిపారు. ఒక్కసారిగా పెరిగిన వృద్ధిని తమ బృందం చక్కగా నిర్వర్తించినందుకు గర్వపడుతున్నట్టు చెప్పారు.
సోమవారం సాయంత్రం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ సేవల్లో ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు గంటలపాటు సేవలు నిలిచిపోయాయి. 40 శాతం మంది వాట్సాప్ యూజర్లు యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, 30 శాతం మంది మెసేజ్లను పంపించలేకపోయారు. 22 శాతం మంది వెబ్వెర్షన్తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి తర్వాతి రోజు తెల్లవారుజామున ఫేస్బుక్ తన సేవలను పునరుద్ధరించగలిగింది. దీంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. టెలిగ్రామ్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 500 మిలియన్లు దాటినట్టు దురోవ్ జనవరిలో ప్రకటించారు.