డిసెంబరులో టెలి షాక్‌!

ABN , First Publish Date - 2020-07-06T06:24:34+05:30 IST

దేశంలో టెలికాం ఛార్జీల తగ్గింపు యుద్ధానికి ఇక తెరపడినట్టే. కంపెనీలు ఇక చార్జీల పెంచడమే తప్ప, తగ్గించే సూచనలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నరలో దేశంలో టెలికాం కంపెనీలు రెండు విడతలుగా చార్జీలు పెంచక తప్పదని...

డిసెంబరులో టెలి షాక్‌!

  • తొలి విడతచార్జీల పెంపు
  • డేటా వాడకానికీ పోటు : ఈవై


న్యూఢిల్లీ: దేశంలో టెలికాం ఛార్జీల తగ్గింపు యుద్ధానికి ఇక తెరపడినట్టే. కంపెనీలు ఇక చార్జీల పెంచడమే తప్ప, తగ్గించే సూచనలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నరలో దేశంలో టెలికాం కంపెనీలు  రెండు విడతలుగా చార్జీలు పెంచక తప్పదని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) అంచనా. కోవిడ్‌ మహమ్మారి లేకపోతే గత నెల్లోనే ఈ పెంపు ఉండేదని తెలిపింది. ప్రస్తుత టెలికాం చార్జీలు ఏ మాత్రం గిట్టుబాటు కానందున, చార్జీలు పెంచడం తప్ప, కంపెనీలకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. బహుశా వచ్చే డిసెంబరులోనే తొలి విడత చార్జీల పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. 


వెంటనే కుదరదు 

ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా టెలికాం కంపెనీలు ఇప్పటికిపుడు చార్జీలు పెంచే అవకాశమైతే లేదని ఈవై స్పష్టం చేసింది. కోవిడ్‌ దెబ్బతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కూడా కాదని తెలిపింది. కోవిడ్‌ తర్వాత పెంచే చార్జీల భారమూ,  వినియోగదారులు భరించే స్థాయిలోనే ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ చార్జీల పెంపు రెగ్యులేటరీ సంస్థల చొరవతో జరుగుతుందా? లేక కంపెనీల చొరవతో జరుగుతుందా? అనే విషయం వేచి చూడాల్సిందేనని ఈవై పేర్కొంది. 


పెంచకపోతే కష్టం 

చార్జీలు పెంచక పోతే టెలికాం సంస్థలు ఆర్థికంగా కోలుకోవడం కష్టమని కూడా ఈవై స్పష్టం చేసింది. మిగతా వర్థమాన దేశాలతో పోల్చినా మన దేశంలో చార్జీలు ఇప్పటికీ తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసిం ది. కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే, మన దేశంలోనూ చార్జీలు కనీసం మిగతా వర్థమాన దేశాల స్థాయిలో ఉండాలని  పేర్కొంది. పీకల్లోతు అప్పులకు తోడు రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్‌ బకాయిల భారం ఇప్పటికే దేశంలోని టెలికాం కంపెనీలను భయపెడుతోంది. వొడాఫోన్‌ అయితే మార్చి, 2020తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో భారత కార్పొరేట్‌ రంగ చరిత్రలో కనీవినీ ఎరగని స్థాయిలో రూ.73,000 కోట్ల భారీ నష్టం ప్రకటించింది. 


ఇక డేటా చార్జీలు!

కంపెనీలు ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ ప్రైస్‌ ప్లాన్లపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి (ఆర్పూ) తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ఇది రూ.160 కూడా లేదు. ఇది కనీసం రూ.200కి చేరితే తప్ప, కంపెనీలు లాభనష్టాలు లేని స్థితికి (బ్రేక్‌ ఈవెన్‌) రావు. వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ఆర్పూ 60 నుంచి 80 శాతం పెరిగితే తప్ప, ఆర్థిక కష్టా ల నుంచి గట్టెక్కడం కష్టమని పరిశ్రమ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ఫిక్స్‌డ్‌ ధరల విధానానికి బదులు, డేటా వినియోగ ఆధారిత చార్జీల విధానం తీసుకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. 


Updated Date - 2020-07-06T06:24:34+05:30 IST