తెలంగాణలోనూ మోదీ తరహా పాలన రావాలి

ABN , First Publish Date - 2022-07-06T04:45:27+05:30 IST

రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నారని..

తెలంగాణలోనూ మోదీ తరహా పాలన రావాలి
హిమాయత్‌ నగర్‌లో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని సన్మానిస్తున్న నాయకులు

మొయినాబాద్‌ రూరల్‌, జూలై 5: రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నారని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇక్కడ కూడా మోదీ తరహా పాలన రావాలని చేవెళ్ల మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి ఆయన మంగళవారం మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌, బాకారం జాగీర్‌, ఎన్కేపల్లి, చిలుకూరు గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా బీజేపీ శ్రేణులు విశ్వేశ్వర్‌రెడ్డిని సన్మానించారు. పలు పార్టీలకు చెందిన నాయకులు కొండా సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8 ఏళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుందని.. ఆ సొమ్ము కేసీఆర్‌, కేటీఆర్‌ జేబుల్లోకి వెళ్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని, రైతులకు అవమానం జరుగుతుందని.. నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని.. వీటన్నింటినీ అధిగమించాలంటే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు. అందుకే తాను ఆ పార్టీలో చేరానన్నారు. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.కార్యక్రమంలో చేవెళ్ల ఇన్‌చార్జ్‌ కంజర్ల ప్రకాష్‌, మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు గున్నాల గోపాల్‌రెడ్డి, ఎల్గని వెంకటే్‌షగౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, భీమేందర్‌రెడ్డి, లక్ష్మీపతియాదవ్‌, శ్రీకాంత్‌, శివ, గోపాల్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-07-06T04:45:27+05:30 IST