తెలంగాణలో ఈ కల్లు చాలా ఫేమస్.. ముందస్తు బుకింగ్..

ABN , First Publish Date - 2022-02-01T19:31:26+05:30 IST

తాటి కల్లు, ఈత కల్లు పేర్లు మాత్రమే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో...

తెలంగాణలో ఈ కల్లు చాలా ఫేమస్.. ముందస్తు బుకింగ్..

హైదరాబాద్: తాటి కల్లు, ఈత కల్లు పేర్లు మాత్రమే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఇప్పుడు తెలంగాణలో జీలుగు కల్లు కూడా ఫేమస్ అయింది. సూర్యాపేట మండలం, కాసారాబాద్ గ్రామంలో జీలుగు కల్లు కోసం జనం క్యూ కడుతున్నారు. ఏకంగా ముందస్తు బుకింగ్ చేసుకోవడమే కాకుండా సీసా రూ. 5వందలకు కొనేందుకు కూడా వెనుకాడడంలేదు. తాటి, ఈత కల్లు కంటే కూడా జీలుగు కల్లు రుచిగా ఉండడంతో జనం ఎగబడుతున్నారు. సైదులు గౌడ్ గత 15 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కల్లు గీయడానికి వెళ్లాడు. అక్కడ జీలుగు కల్లు వాడకంలో ఉండడంతో సైదులు జీలుగు చెట్లకు కల్లు గీయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి జీలుగు కల్లు తీయడం మొదలుపెట్టాడు. దీనికి ఇంత డిమాండ్ ఎందుకంటే జీలుగు కల్లు తాగితే కిడ్నీ రాళ్ల సమస్యలతోపాటు షుగర్, బీపీ సమస్యలు కూడా దరిచేరవని అక్కడి ప్రజల నమ్మకం. జీలుగు కల్లు రుచి చూసినవాళ్లు.. తాటి, ఈత కల్లు కోసం రావడం తగ్గించారని కల్లు గీత కార్మికులు చెబుతున్నారు. జీలుగు కల్లు దెబ్బకు తమ గిరాకీ దెబ్బతిందని చెబుతున్నారు. జీలుగు కల్లుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తమకు కూడా జీలుగు విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించాలని గీత కార్మికులు కోరుతున్నారు.

Updated Date - 2022-02-01T19:31:26+05:30 IST